హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సారి తల్లిదండ్రుల వాట్సాప్నకు టెన్త్ హాల్టికెట్లను పంపించనున్నది. రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్కు వీటిని పంపిస్తారు. ఈ సారి నుంచి హాల్టికెట్లపై క్యూఆర్కోడ్ ముద్రిస్తున్నారు. స్మార్ట్ఫోన్తో ఈ క్యూఆర్కోడ్ను స్కాన్ చేయగానే గూగుల్ మ్యాప్లతో నావిగేట్ వస్తుంది. విద్యార్థులు తమ సెంటర్ రూట్ మ్యాప్ను అనుసరించవచ్చని విద్యా శాఖ అధికారులు తెలిపారు.
పదో తరగతి హాల్టికెట్లను మార్చి 5న విడుదల చేస్తారు. వెబ్సైట్లో విడుదల చేయడంతోపాటు, తల్లిదండ్రుల వాట్సాప్నకు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్టికెట్లను సైతం స్కూళ్లకు చేరవేస్తారు. హాల్టికెట్ల కోసం https://bse.telanga na.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్నాయి. ఈ సారి 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,512 మంది ప్రైవేట్ విద్యార్థులు కలుపుకుని మొత్తంగా 5,28,238 మంది పరీక్షలకు హాజరుకాబోతున్నారు. నిరుటితో పోల్చితే 20వేల మంది విద్యార్థులు పెరిగారు. దీంతో సెంటర్ల సంఖ్యను కూడా పెంచారు.