హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 29 వరకు ఫీజు చెల్లించే గడువుగా విధించగా, అపరాధ రుసుముతో మార్చి 3 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి శుక్రవారం విడుదలచేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. సెలవు రోజుల్లోనూ యాజమాన్యాలు ఫీజు చెల్లించవచ్చని స్పష్టంచేశారు. వార్షిక పరీక్షలను ఏప్రిల్ లేదా మే నెలల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని, హెచ్ఎంలు ఆ ఫీజును ఛలానా రూపంలో ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచ్ ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు సమర్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.24 వేల లోపు ఉంటే మొత్తం ఫీజుకు మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. ఇతర వివరాలకు www. bsetelangana.gov.inను సంప్రదించాలని సూచించారు.