Rohingya | బడంగ్పేట, జనవరి 29: బర్మా దేశస్థుడి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహింగ్యాలు సోమవారం మృతదేహంతో యూఎన్హెచ్ఆర్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. దీంతో రాయల్ కాలనీ డైమండ్ హోటల్ వద్ద ఉద్రిక్త త నెలకొన్నది. బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఇబ్రహీం అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు.
బర్మా దేశానికి చెందిన ఇబ్రహీం బంధువులు, స్నేహితులు మృతదేహంతో నేరుగా రాయల్కాలనీలోని యూఎన్హెచ్ఆర్సీ కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న బాలాపూర్ సీఐ వెంకట్రెడ్డి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు మాట్లాడుతుండగానే రోహింగ్యాలు పోలీసులపై రాళ్లు విసిరారు. శ్రీశైలం అనే హెడ్ కానిస్టేబుల్కు గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు.
పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉండటంతో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు మృతదేహాన్ని షరీఫ్నగర్లోని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిని సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు.