హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో మంత్రి కే తారకరామారావుపై ఎలాంటి విమర్శలు, వ్యాఖ్యలు చేయరాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. కేటీఆర్.. రేవంత్పై దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారించిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పత్రికలు, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మంత్రి కేటీఆర్ పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేలా ఎలాంటి పోస్టులు పెట్టవద్దని, మాట్లాడవద్దని.. రేవంత్, ఆయన అనుచరులను ఆదేశించింది. డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి.. కేటీఆర్కు అపకీర్తి ఆపాదించేలా నోటికి ఏది వస్తే అది మాట్లాడరాదని సిటీ సివిల్ కోర్టు మూడో అదనపు జిల్లా చీఫ్ జడ్జి కల్యాణ్చక్రవర్తి.. రేవంత్కు ఇన్జంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. కేటీఆర్ దాఖలుచేసిన పరువు నష్టం దావాను కోర్టు విచారణకు స్వీకరించి, ప్రతివాది రేవంత్కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ను ఆదేశించింది.
రేవంత్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్రెడ్డి వాదించారు. రేవంత్ నోటిని అదుపు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. డ్రగ్స్ కేసుకూ కేటీఆర్కూ ఏవిధమైన సంబంధం లేకపోయినా ఆ కేసుతో ముడిపెట్టి తీవ్ర ఆరోపణలు చేయడం ద్వారా కేటీఆర్ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్కు లింక్పెట్టి మాట్లాడకుండా ఇన్జంక్షన్ ఆర్డర్ ఇవ్వాలన్నారు. కేటీఆర్కు, డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం సాక్షిగా కూడా లేరని, అయినా కేటీఆర్, అనుచరులు నోటీసులు అందుకోబోతున్నారంటూ రేవంత్ తప్పుడు ప్రకటనలు చేశారని వివరించారు. ఇవన్నీ ట్విట్టర్, ఫేస్బుక్, పత్రికలు, టీవీల్లో ప్రముఖంగా వచ్చాయని వెల్లడించారు. ఇదే పద్ధతి కొనసాగితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, మంత్రిగా, ప్రముఖ రాజకీయ పార్టీ నేతగా ప్రజల్లో పేరున్న పిటిషనర్ పరువు ప్రతిష్ఠలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. కేటీఆర్ పరువుకు నష్టంచేసిన రేవంత్రెడ్డి నుంచి ఏమేరకు నష్టపరిహారం కోరేదీ తర్వాత కోర్టుకు నివేదిస్తామన్నారు. దీనిపై సమగ్ర సమాచార సేకరణలో పిటిషనర్ ఉన్నారని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థిగా రేవంత్ రాజకీయ అంశాలపై మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ, దర్యాప్తు జరుగుతున్న ఓ క్రిమినల్ కేసుతో సంబంధాలున్నట్లుగా డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి అసత్య ఆరోపణలు చేయడాన్ని నిరోధించాలని కోరారు. డ్రగ్స్ కేసులోని వారితో పిటిషనర్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం ద్వారా జనంలోకి తప్పుడు సమాచారాన్ని చొప్పించడాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తిచేశారు. పిటిషనర్కు రేవంత్ బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాల్లోని పోస్టులను రేవంత్, ఆయన అనుచరులు తొలిగించేలా తీర్పు చెప్పాలన్న అంశాల జోలికి కోర్టు వెళ్లలేదు. మధ్యంతర ఉత్తర్వుల అంశం వరకే వాదనలు పూర్తిచేశారు. సుమారు 25 నిమిషాలపాటు సాగిన వాదనల తర్వాత సిటీ సివిల్ కోర్టు.. కేటీఆర్కు వ్యతిరేకంగా డ్రగ్స్ కేసును ముడిపెట్టి ఏ విధమైన ప్రకటనలు, ఆరోపణలు చేయరాదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని రేవంత్కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది.