నయీమ్నగర్/వేములవాడ/కామారెడ్డి, జూన్ 30 : ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించారు. హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి సందర్భంగా తోపులాట జరుగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రదర్శనగా రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి బయలుదేరారు.
ఈ క్రమంలో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టి వారిని నిలువరించే ప్రయత్నం చేయగా, వారు తోసుకొని వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. అయినప్పటికీ కార్మికులు సురేఖ ఇంటి గేటు వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, పరకాలలో తొలగించిన 20 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 65 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని కోరారు.

కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే బీజేపీ నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకొచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు మారుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై మండిపడ్డారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటిని కార్మికులు ముట్టడించారు. అంతకుముందు తమ సమస్యలను పరిషరించాలని కోరుతూ పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ తీసి, రోడ్డుపై బైఠాయించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ముట్టడించారు. ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.