హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన పనులతోపాటు తాగునీటి పనులు తుదిదశకు చేరి ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇతర కాలువల నిర్మాణ పనులను ముమ్మరంచేసింది. ఇప్పటికే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి చేపట్టాల్సిన ప్రధాన కాలువల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించగా, తాజాగా వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువల నిర్మాణానికి సమాయత్తమైంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం 16.74 టీఎంసీలు సామర్థ్యంతో వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్ను ఇప్పటికే నిర్మించింది.
ఈ రిజర్వాయర్ నుంచి 149 కిలోమీటర్ల పొడవు హైలెవల్ కెనాల్ను, 28.96 కిలోమీటర్ల పొడవు లోవెల్ కెనాల్ను నిర్మించాల్సి ఉన్నది. ఈ పనులను మొత్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి, రూ.454.56 కోట్లతో చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. వెంకటాద్రి లోలెవల్ కెనాల్ ద్వారా 16 వేల ఎకరాలకు, హైలెవల్ కెనాల్ ద్వారా 1.17 వేల ఎకరాలకు.. మొత్తంగా రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు కూడా అందనున్నది. ఈ నెల 19వ తేదీతో టెండర్ల దాఖలుగా చివరితేదీగా ప్రభుత్వం నిర్ణయించింది.