హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తొలిదశలో తాగునీటి కోసం చేపట్టిన మెయిన్ ట్రంక్ పనులు పూర్తవడంతో ప్రధాన కాలువల తవ్వకానికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ప్రధాన కాలువ పనులన్నీ ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచే మొదలవనుండటంతో ప్రభుత్వం ఆ రిజర్వాయర్పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సంబంధిత పనుల కోసం అధికారులు ఇప్పటికే దాదాపు రూ.5,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉద్దాండపూర్ దిగువన కరివేన, నారాయణపేట, వికారాబాద్లో దాదాపు 1,100 చెరువులను నింపి తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆమోదం తెలపడంతో ఆయా పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి వికారాబాద్ వరకు 122 కి.మీ. పొడవైన ఎడమ కాలువను తవ్వాల్సి ఉండటంతో ఆ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు. మొత్తంగా రూ.1,469 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే వికారాబాద్ జిల్లాలో దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు వందల గ్రామాలకు తాగునీరు అందుతుంది.