మెదక్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉన్న పల్లెలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కన్పించవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తే దేశం అనుసరిస్తుందన్న నానుడి 40 ఏండ్లు దేశంలో నడిచిందని, కానీ ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తున్నదని అన్నారు. దేశంలో మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణకు 38 శాతం గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయంటే సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైందని చెప్పారు. ఈనెల 19న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన నేపథ్యంలో సోమవారం నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం సీఎం బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని జడ్పీ చైర్పర్సన్ హేమలత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మెదక్ జిల్లాలో 72 మంది పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిందని అన్నారు. కొత్త గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్తగా పదివేల పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి పల్లెలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీలు, డంపుయార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశామని, దీంతో పల్లెలు పరిశుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు.