హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ నెలాఖరులో విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఎస్సెస్సీ ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిసినప్పటికీ, కొన్ని మైనర్ పేపర్ల పరీక్షలు జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. రెండో తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు వెల్లడించారు.
5,029 విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు. 167 మంది ప్రైవేట్ విద్యార్థులకు 87 మంది పరీక్షలు రాసినట్టు వివరించారు. దాదాపు 38 లక్షల పేపర్లను మూల్యాంకనం చేసేందుకు సమయం పడుతుందని, సాధ్యమైనంత తొందరగా ఫలితాలు వెల్లడించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కరోనా కారణంగా దాదాపు రెండేండ్ల విరామం తరువాత ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించారు.
పదోతరగతి పరీక్ష రాసేందుకు బయల్దేరిన ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆఖరి పరీక్ష కోసం బయలుదేరి అనంతలోకాలకు వెళ్లాడు. మరో గంటలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిన ఉండగా ఈ దారుణం జరిగింది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో శనివారం చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారేగాం తండాకు చెందిన రాథోడ్ రాజు-మంజుల దంపతులు పెద్దకుమారుడు రాథోడ్ వికాస్ (17) కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివి పరీక్షలు రాస్తున్నాడు.
కారేగాం తండా నుంచి బీర్కూర్లోని పరీక్షా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజూ ఇంటినుంచి వచ్చి పరీక్షలు రాస్తున్న వికాస్ శనివారం సాంఘిక శాస్త్రం పరీక్ష రాసేందుకు ఉదయం బైక్పై బీర్కూర్కు బయల్దేరాడు. చందూర్ గ్రామ శివారులోని సబ్స్టేషన్ వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో వికాస్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలికి చేరుకొన్న విద్యార్థి తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వర్ని ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు.