TS Weather | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో గురువారం అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లో 42.5 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.