Weather update | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు చలి గాలులు వీస్తాయని, రెండో వారంలో ఉదయం వేడిగాలులు, సాయంత్రం చలిగాలులు వీస్తాయని తెలిపారు.
అదేనెల మూడోవారంలో మళ్లీ చలి పెరుగుతుందని, నాలుగో వారంలో ఎండల తీవ్రత మొదలవుతుందని తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఎలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఏప్రిల్ వరకు కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే మార్చిలో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు డైరెక్టర్ నాగరత్న తెలిపారు.