Temperatures | హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజానీకం ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంకా ఎండాకాలం ప్రారంభం కాకముందే ఇవేం ఎండలు అని అంటున్నారు.
రాబోయే 4 రోజులు తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని, ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు వాతావరణం చల్లబడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో చల్లటి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి 16 తర్వాత క్రమేణ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
గ్రేటర్ హైదరాబాద్లోనూ ఎండలు మండి పోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో నమోదైన పగటి ఉష్ణోగ్రతలతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం జూబ్లీహిల్స్లో 38.4 డిగ్రీలు, సరూర్నగర్, చందానగర్లో 38.3 డిగ్రీలు, బేగంపేటలో 37.6 డిగ్రీలు, ఉప్పల్లో 37.3 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఏ రేంజ్లో ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.