తెలుగుయూనివర్సిటీ, డిసెంబర్ 4: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018, 2019 విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. 2018 సంవత్సరానికి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2019కి కళాకృష్ణకు పురస్కారాలను అందజేయనున్నట్టు రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ వెల్లడించారు. ఒక్కొక్కరికి పురస్కారం కింద లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. డిసెంబర్ 12న విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ కళామందిరంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం జరుగుతుందని రమేశ్ పేర్కొన్నారు. కూరెళ్ళ విఠలాచార్య 1938లో యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో జన్మించారు. కవిగా, విమర్శకునిగా 22 పుస్తకాలను వెలువరించారు. ప్రధానోపాధ్యాయుడుగా పదవీ విరమణ చేసిన తర్వాత సొంతూరులోని స్వగృహంలో సుమారు రెండు లక్షల పుస్తకాలతో గ్రంథాలయం నెలకొల్పి పరిశోధక విద్యార్థులకు తోడ్పాటును అందిస్తున్నారు. 1951లో కరీంనగర్ జిల్లాలో జన్మించిన కళాకృష్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ వద్ద గురుకుల పద్ధతిలో ఆంధ్రనాట్యాన్ని అభ్యసించారు. 45 ఏండ్లుగా సేవలందిస్తూ వేలాది ప్రదర్శనలిచ్చారు. భరతనాట్యం, కూచిపూడి నాట్య శైలిలో కూడా శిక్షణ పొందారు. నవజనార్దన పారిజాతం ప్రదర్శించడంలో కళాకృష్ణ తనదైన ముద్రవేశారు. సత్యభామ పాత్రలో అపూర్వమైన అభినయానికి మెచ్చి కళాభిమానులు ఆయనను అభినవ సత్యభామ అని ప్రశంసించారు.