హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ : తెలుగు యూనివర్సిటీ నాంపల్లి ప్రాంగణంలోని గ్రౌండ్ఫ్లోర్ను ఆది ధ్వని సంస్థకు అప్పగిస్తున్నారన్నది అబద్ధమని, సదరు సంస్థను కేటాయిస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని వర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా సంస్థకు అప్పగిస్తున్నారంటూ వర్సిటీ మాజీ ఉద్యోగి తిరుమలరావు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఒకేచోట ఉండాలనే నిబంధన ఎక్కడా లేదని, పరిపాలనా సౌలభ్యం, అవసరాల దృష్ట్యా వర్సిటీలోని వివిధ విద్యా విభాగాలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నాయని తెలిపారు. తెలుగు వర్సిటీలో పని చేసిన తిరుమలరావుకు అవగాహన ఉన్నా, వాస్తవాలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను విరమించుకోవాలని కోరారు.
నాంపల్లి ప్రాంగణంలో డేస్కాలర్స్ కోసం 12 కోర్సులు నడుస్తున్నాయని, వందలాది మంది విద్యార్థులు ఈ ప్రాంగణంలో విద్యనభ్యసిస్తున్నారని నిత్యానందరావు తెలిపారు. గ్రౌండ్ఫ్లోర్లో దూర విద్యాకేంద్రం, ఎన్టీఆర్ ఆడిటోరియం, చిత్రవాణి స్టూడియో, తెలుగుజాతి వస్తు ప్రదర్శనశాల, కంప్యూటర్ ల్యాబ్, జ్యోతిష్యశాస్త్రం, విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నాంపల్లి ప్రాంగణంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలు, పరిపాలనా విభాగాలు, మౌలిక సదుపాయాల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.
తెలుగు యూనివర్సిటీ నాంపల్లి ప్రాంగణాన్ని ఆక్రమించుకోవాలనే యోచనను విరమించుకోవాలని కోరుతూ వర్సిటీ పరిరక్షణ సమితి విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది 12 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం తెలుగు వర్సిటీని ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు సందర్శించి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, తరగతి గదులు, ఆడిటోరియం, సమావేశ మందిరం, మ్యూజియం, స్టూడియో తదితర విభాగాలను పరిశీలించారు. వీసీ నిత్యానందరావు, విద్యార్థులతో ఇంటెలిజెన్స్ అధికారులు చర్చలు జరిపారు.