మామడ, డిసెంబర్ 17: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉదయం అల్పాహారం కో సం క్యూలో నిల్చున్న ఓ బాలిక.. ప్రమాదావశాత్తు వేడి వేడి రాగిజావలో పడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెం దింది. ఈ ఘటన శనివారం నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్లో చోటుచేసుకన్నది. కొరటికల్కు చెందిన కొండ్ర అశోక్-శిరీషల కూతురు కొండ్ర ప్రజ్ఞ(6) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నది.
రోజు మాదిరిగానే శనివారం పాఠశాలకు వెళ్లింది. ఉదయం 11:30 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు రాగిజావ వడ్డించడానికి మధ్యాహ్న భోజన నిర్వాహకులు ముత్తవ్వ, లావణ్య, రాజమణి, లక్ష్మీలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వేడి చేసిన రాగిజావను పెద్ద పాత్ర నుంచి బకెట్లోకి వేరు చేస్తున్నారు. ఇంతలో లైన్లో నిల్చున్న ప్రజ్ఞ.. ప్రమాదవశాత్తు వేడి రాగిజావ పాత్రలో పడిపోయింది.
బాలిక తల, చేతులు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను చికిత్స కోసం ఉపాధ్యాయులు సుధాకర్, శ్రీనివాస్, పద్మ, కుటుంబ సభ్యులు నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవే ట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి 10 గంటలకు మృతిచెందింది. ఈ ఘటనపై తహసీల్దార్ సర్ఫరాజ్ విచారణ చేపట్టగా.. అల్పాహారం అందించే సమయంలో విద్యార్థులు వరుసలో ఉండేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోలేదని తేలింది.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు.. డీఈవో రవీందర్రెడ్డి.. పాఠశాల ఇన్చార్జి ప్రాధనోపాధ్యాయురాలు రమను సస్పెండ్ చేయడంతోపాటు ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించారు. మృతురాలి తల్లి కొండ్ర శిరీష ఈ గ్రామానికి ఉపసర్పంచ్గా ఉన్నారు. చిన్నారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.