Lok Sabha Polls | త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిర్ణయించింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై తెలంగాణ సచివాలయంలో సోమవారం సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎస్లు శాంతికుమారి, జవహర్రెడ్డి, డీజీపీ రవిగుప్తా పాల్గొనగా.. వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ మే 13న జరిగే పోలింగ్ను సక్రమంగా నిర్వహించేందుకు ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల పరిధిలోని కలెక్టర్లు, వివిధశాఖ ఉన్నతాధికారుల సమన్వయ సమావేశాలు నిర్వమించినట్లు తెలిపారు.
అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ వస్తువుల రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని.. ఇదే వాతావరణాన్ని పోలింగ్ వరకు పకడ్బందీగా కొనసాగించేందుకు ఉభయ రాష్ట్రాల మధ్య సీఎస్ల సమావేశం దోహదపడుతుందని పేర్కొన్నారు. గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రవాణా కాకుండా సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ తరఫున పోలీస్ శాఖ ద్వారా 36 అంతరాష్ట్ర చెక్ పోస్టులు, ఆటవీ శాఖకు సంబంధించి మూడు అంతరాష్ట్ర చెక్ పోస్టులు, ఎక్సైజ్శాఖ ఎనిమిది, 224 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, వాణిజ్యపన్నుల శాఖ ద్వారా ఏడు చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24గంటల పటిష్టమైన గస్తీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణలో తీవ్రవాద ప్రాబల్యం లేదని, ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరుగకుండా ఇరు రాష్ట్రాలు పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్టమైన సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. ఏపీ సీఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున.. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు.