ప్రశ్నాపత్రం రూపకల్పనపై వారంలో స్పష్టత
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది తెలుగు వార్షిక పరీక్షలను సంబంధిత బోర్డులే నిర్వహిస్తాయి. మిగతా పేపర్లకు నిర్వహించినట్టుగానే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డులే తెలుగు పరీక్షనూ నిర్వహిస్తాయి. అయితే ఈ ప్రశ్నాపత్రాన్ని ఆయా బోర్డులు రూపొందిస్తాయా? లేక ఎస్సీఈఆర్టీ రూపొందిస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయా బోర్డుల్లో ప్రశ్నాపత్రాలు రూపొందించేందుకు తెలుగు నిపుణులు లేకపోవడంతో ఎస్సీఈఆర్టీ రూపొందించవచ్చని తెలుస్తున్నది. దీనిపై ఎస్సీఈఆర్టీ అధికారులు సంబంధిత బోర్డులతో చర్చలు జరుపుతుండటంతో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
బోర్డులకు లేఖలు
రాష్ట్రంలోని సీబీఎసీ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డు స్కూళ్లల్లో తెలుగు అమలు చట్టం-2018 ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు ఇటీవలే ఆయా బోర్డులకు లేఖలు రాశారు. స్కూళ్లల్లో రెండో భాషగా తెలుగును అమలు చేయాలని, లేకపోతే కఠిన చర్యలు చేపడతామని ఆ లేఖలో పేర్కొన్నారు.
వీరికి మినహాయింపు
రాష్ట్రంలో నేరుగా 8, 9, 10 తరగతుల్లో చేరిన ఇతర రాష్ర్టాల విద్యార్థులకు మాత్రం తప్పనిసరి తెలుగు నుంచి మినహాయింపు ఉంటున్నది. ఇం దుకు వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.