సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూళ్లల్లోనూ..
రెండు పుస్తకాలను ముద్రించిన ఎస్సీఈఆర్టీ
వార్షిక పరీక్షల్లో తొలిసారిగా తెలుగు పేపర్
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. నిర్దిష్ట మార్కులు పొంది పాస్ కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో తొలిసారిగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ను తప్పనిసరిగా ప్రవేశపెడుతున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఇంటర్నేషనల్ బోర్డు (ఐబీ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) బోర్డుల ద్వారా గుర్తింపు పొందిన స్కూళ్లల్లో బహుళభాషా విధానం అమల్లో ఉంది. 1-4 తరగతుల్లో ఏదేనీ రెండుభాషలు, 5 నుంచి 8 వరకు త్రిభాషా సూత్రం ప్రకారం మూడు భాషలు, 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్ తప్పనిసరి కాగా, మరో ప్రాంతీయ భాషను విద్యార్థులు ఎంచుకోవచ్చు. తాజాగా మన రాష్ట్రంలో తెలుగు తప్పనిసరి కావడంతో పదో తరగతిలోకి ప్రవేశించే వారు ఇంగ్లిష్, తెలుగులను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
5, 10 తరగతులకు
రాష్ట్రంలోని అన్ని సెంట్రల్ స్కూళ్లల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి 5, 10 తరగతుల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డుల పాఠశాలల్లోనూ తెలుగును బోధించాలని ఆదేశాలిచ్చింది. తెలుగుభాష పరిరక్షణ కోసం పాఠశాలల్లో తెలుగును ఓ సబ్జెక్టుగా బోధించేలా 2018 మార్చి 30న యాక్ట్-10 పేరుతో రా్రష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. దీనిని అమలుచేయాలని సూచిస్తూ 2018 ఏప్రిల్ 2న జీవో-15ను జారీచేసింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేస్తున్నారు. ఇప్పటివరకు 1,2,3,4,6,7,8,9 తరగతుల్లో తెలుగును బోధనాంశంగా అమలుచేస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది నుంచి 5, 10 తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేసింది. దీంతో 2022 -23 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని తరగతుల్లో తెలుగు అమల్లోకి వచ్చింది. ఇక ఈ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చూడాలని కోరుతూ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డు చైర్పర్సన్స్కు విద్యాశాఖ అధికారులు ఇటీవలే అధికారులు లేఖలు రాశారు.
మార్గదర్శకాలిలా..