హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ)/కొల్చారం: తెలుగు సాహితీరంగానికి జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథ సూరి పేరిట మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ వర్సిటీని మూడు కోర్సులతో ప్రారంభించాలని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అంతా సవ్యంగా ఉంటే వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు నిర్వహించాలని, డిగ్రీ, డిప్లొమా, పీజీ కోర్సులను వర్సిటీలో నిర్వహించాలని సూచించింది. సంస్కృత వర్సిటీ ఏర్పాటుపై అధ్యయనం కోసం కాళిదాస్ సంస్కృత యూనివర్సిటీ రాంటెక్ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్, సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్తో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
త్రిసభ్య కమిటీ సభ్యులు బుధవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి వర్సిటీ ప్రతిపాదిత ప్రాంతమైన మెదక్ జిల్లా కొల్చారంలో పర్యటించారు. వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించిన 30 ఎకరాల స్థలాన్ని, మరోచోట గుర్తించిన 27 ఎకరాల స్థలాలన్ని వారు పరిశీలించారు. విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు కొల్చారంలో రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించామని, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కూడా స్థలాలపై పూర్తి సమాచారమిచ్చారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం ఎంపిక కోసం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.