సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 5 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణఫురం మండలంలోని పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తున్నది. తాజాగా ఈనెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో తేలియా రుమాలు మెరువనున్నది. సదస్సు సందర్భంగా నిర్వహించే క్రాఫ్ట్బజార్లో తేలియా రుమాలు స్టాల్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ బజార్ను పలు దేశాధినేతలు సందర్శించనున్నారు. పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన ఈ రుమాలుతోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీర, డబుల్ ఇక్కత్ డాబి బోన్ దుప్పటి, పలు వస్ర్తాలు ప్రపంచ దేశాధినేతలను ఆకర్షించనున్నాయి. ఇప్పటివరకు పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జాతీయ అవార్డులు వచ్చాయి.