పటాన్చెరు, అక్టోబర్ 5: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఐపీఎస్ అధికారి, మహిళా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు. మంగళవారం గీతం విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన గీతం చేంజ్ మేకర్స్ ముఖాముఖి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడారు. పౌర సమాజం స్వచ్ఛందంగా ముందుకొస్తే కలిసి పనిచేయడానికి తాము సిద్ధమేనని ఆమె తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక మహిళల భద్రత కోసం పలువురు ఐఏఎస్, ఐపీఎస్లతో సీఎం కేసీఆర్ ఒక కమిటీని వేశారని, అందులో 82 సిఫారసులు వచ్చినట్టు చెప్పారు. ఈ రకంగా ఏర్పాటైన షీ టీమ్స్కు నాయకత్వ బాధ్యతలను తనకు అప్పగించడం జరిగిందన్నారు.
మర్యాద, అసభ్యకర ఘటనలు జరిగిన వెంటనే మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని స్వాతి లక్రా పిలుపునిచ్చారు. బాధిత మహిళ పోలీస్ స్టేషన్కు వచ్చే అవసరం లేకుండా వాట్సాప్, క్యూఆర్ కోడ్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, తక్షణమే సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీనికి ఐసీసీ వంటి పలు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తోడైందన్నారు. ఫిర్యాదు నేపథ్యం, తగిన ఆధారాలు, సాంకేతిక సహకారంతో నమోదైన కేసులను త్వరగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 30 వేల కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. చాలా వరకు చిన్న కేసులేనని, తప్పులు పునరావృతం చేసేవారి సంఖ్య, మైనర్లు నిందితులు కావడం తమను కలిచివేసిందన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తున్నదని చెప్పారు. నేరాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడమే అందుకు నిదర్శనమన్నారు. షీ టీమ్స్ పలు కళాశాలలను సందర్శించి చేపట్టిన చైతన్య కార్యక్రమాలు ఫలవంతమైనట్టు తెలిపారు. మహిళలపై నమోదయ్యే కేసుల్లో గృహహింసవే ఎక్కువన్నారు. ఫిర్యాదులు రాగానే వలంటీర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి వాటిని నివారించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా గీతం యూనివర్సిటీ హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.