హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వయంపాలనలో ప్రజా పరిపాలన అత్యంత పారదర్శకంగా సాగుతున్నదని, అత్యాధునిక సాంకేతిక విధానాలను అందిపుచ్చుకొని సౌకర్యవంతమైన రీతిలో ప్రజల వద్దకే పాలనా ఫలాలు చేరుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సుపరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో, అందుకు తగ్గట్టుగా రూపొందించిన సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సీఎం ఆదేశించారు. శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కాలినడకన నలుమూలలా కలియదిరిగి పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించి పలు సూచనలుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడేండ్ల తెలంగాణలో సాగుతున్న ఆదర్శవంతమైన పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండే సెక్రటేరియట్ నిర్మాణకౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా, గౌరవం ఉట్టిపడేలా ఉండాలని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో, సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకొనే విధంగా సచివాలయం ఉండబోతున్నదన్నారు. ప్రజలవద్దకే నేరుగా పాలనాఫలాలు చేరుకొంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగానే నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగంగా పూర్తిచేయాలని సీఎం అన్నారు.
సచివాలయం చుట్టూ కాలినడకన తిరిగి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఇతర రాష్ట్రాలనుంచే కాక, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, ప్రముఖుల కోసం నిర్మితమౌతున్న ‘వెయిటింగ్ హాల్’ను, సందర్శకులు కూర్చొనే ప్రదేశాలను సీఎం పరిశీలించారు. పారింగ్ వ్యవస్థ గురించి ఆరాతీశారు. కార్లు, టూవీలర్లు, బస్సులు తదితర వాహనాల పారింగ్ స్థలాలను పరిశీలించారు. హెలీపాడ్ నిర్మాణం గురించి తెలుసుకొన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్కు వచ్చే వీఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సీఎం వివరించారు. అవసరమైన వారికోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ నిర్మాణంలో కీలకమైన గ్రౌండ్ఫ్లోర్ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో, ప్రత్యేక చర్యలు చేపట్టి పైఅంతస్తుల పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో చర్చించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు సీ లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రేగా కాంతారావు, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్రెడ్డి, హన్మంత్షిండే, రోహిత్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్తేజ, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, నిర్మాణ సంస్థ శాపూర్జీ పల్లొంజీ ప్రతినిధులు, ఇంజనీర్లు తదితరులున్నారు.
సెక్రటేరియట్ ముందు, చుట్టుపకలనుంచి వర్షపు నీరు పోవడానికి అనువైన విధంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని చెప్పారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎకడికకడ నీరు తరలిపోయేలా వుండాలన్నారు. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే ముందస్తు వ్యూహంతో అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దర్వాజలు, కిటికీలు, ఫర్నీచర్, విద్యుత్తు, ప్లంబింగ్, టైల్స్ వంటి సచివాలయ నిర్మాణంలోని అన్నిరకాల విభాగాలకు చెందిన ఇంటీరియర్ మెటీరియల్ను ముందస్తుగా సమకూర్చుకోవాలని సూచించారు. సచివాలయం ముఖద్వారాన్ని, బయటిగేటు నిర్మాణాలను, వాటికి అమర్చవలసిన గ్రిల్స్ తదితర అంశాలను, సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రహరీ గోడలకు అమర్చాల్సిన ల్యాంప్ పోస్టుల గురించి సూచనలిచ్చారు. విశాలంగా నిర్మిస్తున్న కారిడార్ ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం, సీఎస్ సహా మంత్రుల కార్యాలయాలు, ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు.