హైదరాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ దార్శనికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన హయాంలో నిర్మించిన శత్రు దుర్భేద్యమైన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) గొప్పదనం మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతున్నది. ఈ అద్భుతమైన కట్టడం గురించి విన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా.. తాజాగా ప్రత్యక్షంగా వీక్షించి ఐసీసీసీ విశిష్టతను మనసారా కొనియాడారు. కార్యాలయ ఆవరణలోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఈ నిర్మాణాన్ని చూస్తూ ముగ్ధుడైపోయారు. ఐసీసీసీ గురించి తెలంగాణ పోలీసులు ఆయనకు వివరిస్తుంటే శ్రద్ధగా విన్నారు. తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఒక్కో విభాగం ఈ కార్యాలయం కేంద్రంగా వినియోగిస్తున్న సాంకేతికత గురించి తెలుసుకొని తన్మయత్వం పొందారు. ఐసీసీసీలోని అన్ని విభాగాలను తీక్షణంగా పరిశీలించారు. కట్టడం పునాది దగ్గర్నుంచి.. పైన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చాంబర్ వరకూ ప్రతీదీ క్షుణ్ణంగా తెలుసుకున్నారు. మన పోలీసులు ఆ కట్టడం గొప్పదనం గురించి వివరిస్తుంటే అతనితోపాటు వచ్చిన మేఘాలయ ప్రతినిధి బృందాలు సైతం మంత్రముగ్ధులయ్యారు.
కమాండ్ కంట్రోల్ పనితీరుపై ఆరా
కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న మేఘాలయ ముఖ్యమంత్రి బృందానికి ఇకడి ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈ సెంటర్లో అత్యంత ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యాలను ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా నగర భద్రతను పర్యవేక్షించే టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ఇకడి అత్యాధునిక వీడియో వాల్, అత్యవసర సేవల సమన్వయ వ్యవస్థ(రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్-డయల్ 112), విపత్తు నిర్వహణ సమయాల్లో ఈ కేంద్రం ఎలా సమర్థవంతంగా పనిచేస్తుందో అధికారులు లైవ్ డెమో ద్వారా చూపించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్ల గురించి ప్రత్యేకంగా వివరించారు. ఐసీసీసీ నుంచి అనుసంధానించిన సీసీ కెమెరాల నిర్వహణ, మానిటరింగ్, నిమిషాల వ్యవధిలోనే స్పందించే బృందాల పనితీరును ఉదాహరణలు, ప్రత్యక్ష ఘటనలతో కండ్లకు కట్టినట్టు చూపించారు.
మేఘాలయలోనూ ఏర్పాటు చేస్తాం..
ప్రజా భద్రత, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న సాంకేతిక విధానాలను మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా అభినందించారు. ఇకడి టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, భారీ వీడియో వాల్ పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. సెంటర్ పనితీరును మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు త్వరలోనే మేఘాలయ నుంచి ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఇకడికి పంపిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఈ అధ్యయనం ఆధారంగా మేఘాలయ రాష్ట్రంలోనూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ తరహాలోనే ఒక అత్యాధునిక ‘టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్’ స్థాపించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ఆయనతో పాటు మేఘాలయ పరిశ్రమల శాఖ కమిషనర్ అండ్ సెక్రటరీ సిరిల్ వీ డార్లాంగ్ డియంగ్డో, సచివాలయ జాయింట్ సెక్రటరీ శివాంష్ అవస్థి, ఇతర ఉన్నతాధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు.
దేశంలోనే అత్యుత్తమైన వాటిల్లో ఒకటి..
ఐసీసీసీ కీర్తిని వివరిస్తూ సంగ్మా ప్రత్యేకంగా వీడియోలు చేశారు. ‘మనం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాం. ఎలాంటి సందేహం లేదు.. దేశంలోనే అత్యుత్తమ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లలో ఇది ఒకటి. వీరు ఇకడ కేవలం సాంకేతికతను మాత్రమే ఉపయోగించడం లేదు. పాలనను మెరుగుపరచడానికి, మరింత మెరుగ్గా మార్చడానికి ఒక అద్భుతమైన వ్యవస్థను అభివృద్ధి చేశారు. సాంకేతికతను ఉపయోగించేలా చూడటం, వివిధ విభాగాలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడం, ప్రజలకు వారు అందించాలనుకుంటున్న సేవలను మరింత మెరుగ్గా మార్చడం ద్వారా ఇది సాధ్యమైంది. సాంకేతికపరమైన భద్రతకు ఇదిఅద్భుతమైన ఉదాహరణ. దీని నుంచి చాలా రాష్ట్రాలు నేర్చుకోవాలని నేను భావిస్తున్నా. మా మేఘాలయ రాష్ట్రంలో కూడా రీప్లికేట్ చేయడానికి ప్రయత్నిస్తాం’ అంటూ ముగించారు.