రేవంత్రెడ్డి గద్దెనెక్కగానే హైడ్రాను తెచ్చి నగర ప్రజలకు నరకం చూపిస్తున్నడు. పెద్దల ఇండ్లను వదిలి పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపుతున్నడు. కాంగ్రెస్ నేతల కల్లబొల్లి మాటలు నమ్మితే వాళ్లిక తిరుగులేదని భావించి మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తరు. ఇప్పుడు పక్క బస్తీలకు వచ్చిన హైడ్రా రేపు మీ ఇండ్లపైకి వస్తది. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలె.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తేతెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి ఢిల్లీకి చెందిన బేకార్ పార్టీలను తరిమికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. చెయ్యి గుర్తుకు ఓటేస్తే హైడ్రా కూల్చివేతలకు లైసెన్స్ ఇచ్చినట్టేనని స్పష్టంచేశారు. 24 నెలల్లో హైదరాబాద్లో ఒక్క గుంత కూడా పూడ్చని, ఒక్క ఇటుక కూడా పేర్చని సీఎం రేవంత్రెడ్డి.. హైడ్రాను తెచ్చి వేలాది పేదల ఇండ్లను నేలమట్టం చేశారని మండిపడ్డారు. ‘బుల్డోజర్లు పంపి ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యామా? కనీసం ఒక్క బ్రిడ్జి అయినా కట్టినవా? అండర్ పాసైనా అందుబాటులోకి తెచ్చినవా? ఫ్లై ఓవర్కైనా ముగ్గుపోసినవా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు, బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు ఏవిధంగా ముందుకెళ్లాలి? తీసుకోవాల్చిన జాగ్రత్తలు..అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ‘కేసీఆర్ మళ్లీ రావాలంటే కాంగ్రెస్కు సురుకుపెట్టాలి..జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలుపెట్టాలి’ అని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఢిల్లీ పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మకుండా సరైన తీర్పే ఇచ్చారని పేర్కొన్నారు. కానీ పల్లె ప్రజలు కాంగ్రెస్ ఏవో పథకాలు ఇస్తుందని నమ్మి ఇప్పుడు అరిగోస పడుతున్నారని చెప్పారు.
పెద్దలకు ఓ నీతి..పేదోళ్లకు మరోనీతా?
ఎఫ్టీఎల్లో ఉన్న రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి, మంత్రులు పొంగులేటి, వివేక్, కాంగ్రెస్ నేత కేవీపీ ఇండ్లను వదిలిపెట్టి పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతున్నారని కేటీఆర్ తూర్పారబట్టారు. తన ఇల్లు కూల్చివేస్తారనే భయంతోనే కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని గుర్తుచేశారు. కనీసం చిన్న పిల్లల పుస్తకాలు, వాటర్ బాటిళ్లు కూడా తీసుకోనివ్వకుండా ఇండ్లు కూల్చారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడూ పేదలపై ప్రతాపం చూపలేదని, గుడిసెల్లో ఉంటున్న లక్షల మందికి పట్టాలిచ్చారని, లక్ష ఇండ్లు కట్టించారని కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. రేవంత్రెడ్డి మాత్రం అసమర్థ పాలనతో హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లు, బిల్డింగ్లకు పెయింటింగ్ వేయడం..రిబ్బన్ కటింగ్లు గొప్పగా చేస్తున్నారు తప్ప రేవంత్ సర్కారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలకు రెండేళ్లయినా ముహూర్తం దొరకడంలేదా? అని చురకలంటించారు.
అజారుద్దీన్ ముసుగులో ముస్లింలకు ధోకా
జూబ్లీహిల్స్లో ముస్లింల ఓట్లకోసమే సీఎం రేవంత్రెడ్డి అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పేరిట ధోకా ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఆయన ఎంపిక చెల్లబోదని తేల్చిచెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రు సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే అప్పటి బీజేపీకి చెందిన మహిళా గవర్నర్ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. హైకోర్టు చెప్పినా వినకపోవడంతో శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమీర్అలీఖాన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయగా బీజేపీతో రేవంత్రెడ్డికి ఉన్న మైత్రిబంధంతో మోదీ సూచన మేరకు గవర్నర్ ఆమోదించారని చెప్పారు. కానీ కేసు పెండింగ్లో ఉండగా ఎలా ఎంపిక చేస్తారని సుప్రీంకోర్టు వారి ఎన్నిక చెల్లదని మధ్యంతర తీర్పు వెలువరించిందని తెలిపారు. ఇప్పుడు అమీర్అలీఖాన్ను పక్కనబెట్టి అజారుద్దీన్ను మళ్లీ తెరపైకి తెచ్చి ముస్లింల ఒట్లను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, ఆయనను అడ్డం పెట్టుకొని ముస్లింలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ముసుగులో బీజేపీ సర్కారు
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ముసుగులో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్చట్టాన్ని దేశంలో తొలిసారిగా తెలంగాణలో అమల్లోకి తెచ్చారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే ముందు వరుసలో నిలిచిన ఘనత ఆయనకే దక్కిందని చురకలంటించారు. ముస్లింలకు వ్యతిరేకమైన ఆ చట్టాన్ని రాజ్యసభలోని నలుగురు బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ‘రేవంత్రెడ్డి కాంగ్రెస్కు చెందిన వాడైనా మోదీ పార్టీలో స్కూల్ విద్య అభ్యసించిండు.. చంద్రబాబు వద్ద కాలేజీ పూర్తిచేసిండు.. ఇప్పుడు రాహుల్గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నడు.. మన దగ్గర కూడా హైస్కూళ్లలో చేరిండు.. కానీ పిల్లా డి బుద్ధి బాగాలేదని కేసీఆర్ హైస్కూల్ నుంచి వెళ్లగొట్టిండ్రు.. రేవంత్రెడ్డి మాత్రం ఈ విషయం దాచిపెడుతున్నడు’ అంటూ తనదైన శైలిలో ఎద్దేవాచేశారు.
మోదీ, అదానీ విషయంలో రేవంత్రెడ్డి రాహుల్గాంధీతో విభేదిస్తున్నారని చెప్పారు. ‘మోదీని రాహుల్ చౌకీదార్..ఓట్ చోర్ అంటే రేవంత్రెడ్డేమో బడే భాయ్ అంటున్నడు.. ఆయన ఆదానీని అవినీతి పరుడంటే, ఈయన మంచి దోస్త్ అంటడు.. ఆయన సీబీ ఐ కరాబ్ అంటే.. ఈయనేమో అచ్చాయే అంటడు. ఆయన గుజరాత్ మోడల్ బేకార్ అంటే ఈయన బాగున్నదంటడు’ అంటూ రేవంత్, మోదీ మైత్రి బంధాన్ని కేటీఆర్ ఎత్తిచూపారు. పక్కన ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తే రేవంత్రెడ్డి ద్వారాలు తెరిచారని తూర్పారబట్టారు. రేవంత్రెడ్డిని అడ్డంపెట్టుకొని కేసీఆర్ను ఖతం చేసేందుకు గులాబీ జెండాను ఎగరకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని చెప్పారు.
ముగ్గురక్కలే సంతోషంగా ఉన్నరు..
కాంగ్రెస్ 22 నెలల పాలనలో అన్ని వర్గాలు ఆగమయ్యాయని కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. నాడు అన్నింటా ముందున్న హైదరాబాద్ నగర ప్రజలు నేడు నరకం అనుభవిస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు రేవంత్ సర్కారుపై కోపంగా ఉన్నారని, కానీ ఆయన సతీమణి గీతక్క, మంత్రులు సీతక్క, సురేఖక్క మాత్రం సంతోషంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఒకరేమో సంపద వచ్చిందని, మరో ఇద్దరేమో మంత్రి పదవులు వచ్చాయని మురిసిపోతున్నారని చెప్పారు. కానీ స్కూటీలు, నెలకు రూ. 2500, తులం బంగారం అందక ఆడబిడ్డలు మాత్రం ఆవేదనలో మునిగిపోయారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్లోకి గద్వాల కాంగ్రెస్ నేతలు
గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ధరూర్, మల్దకల్, కేటీదొడ్డి మండలాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యనేతలు ఆ పార్టీని వీడారు. శుక్రవారం తెలంగాణ భవన్లో గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంత్ నాయడు నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారంతా బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని, కష్టపడ్డ వారికి భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
పార్టీలో చేరింది వీరే..
మాజీ సర్పంచులు: ప్రతాప్ (అల్లపాడు), ధర్మారావు (కొత్తపాలెం), ఈరన్న (మార్లబీడు), ఆంజనేయులు (చిన్నపాడు), ఆంజనేయులు (వానపల్లి), హనుమంతు (నేతోనిపల్లి), హనుమంతు (ఈర్లబండ), గోకరి (మాజీ ఉప సర్పంచ్, బిజ్వారం)
మాజీ ఎంపీటీసీలు: లక్ష్మీరెడ్డి (చింతరేవుల), హనుమంతు (పార్చర్ల), ప్రహ్లాద్ (వానపల్లి), ఆంజనేయులు (మన్నపురం), గోవింద్ (మల్లాపురం), సీ కే రంగన్న (విండో వైస్ చైర్మన్, అల్వాల్పాడు), మంత్రా నాయక్, రమేశ్ ఎల్కూర్ (సింగిల్ విండో డైరెక్టర్లు)
ముఖ్యనేతలు: కష్ణారెడ్డి (అమరవాయి), రవి (గార్లపాడు), ముదిరాజ్ ఆంజనేయులు (గార్లపాడు), మెకానిక్ గోవింద్ (బిజ్వారం), నాగరాజు(ఎల్కూర్).
కేటీఆర్కు మునుగోడు ట్రిపుల్ఆర్ బాధితుల గోడు
మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్, నారాయణపూర్, మరిగూడెం, చింతపల్లి మండలాల ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు కేటీఆర్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, పార్టీ నేతలు పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, సీనియర్ నేత చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. అలైన్మెంట్ మార్పుతో తమ బతుకు దెరువువైన భూమి పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సర్కారు వైఖరి, కాంగ్రెస్ పెద్దల ధనదాహానికి తాము బలవుతున్నాయని వాపోయారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ ఉన్నప్పుడు పేదలకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా అండగా నిలిచిండ్రు. కష్టాల్లో ఉన్న సర్ధార్ కుటుంబాన్ని ఆదుకున్నరు. ఆయన ఆశయ సాధన కోసం గోపన్న కుటుంబాన్ని ఆదరించాలె.
-కేటీఆర్