B.Vinod Kumar | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని ఆర్థిక వనరులున్న బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పదేపదే తెలంగాణను అప్పుల కుప్ప చేశారని పేర్కొనటాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల ఆర్థిక వనరుల వివరాలతో ఆర్బీఐ విడుదల చేసిన ఆర్థిక విశ్లేషణను పరిశీలించాలని సూచించారు.
ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం రాష్ట్ర సొంతపన్నుల ఆదాయాన్ని (ఎస్వోటీఆర్) సమకూర్చుకోవడంలో తెలంగాణ 84.2 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. పదేండ్ల కాలంలో కేసీఆర్ ఎంతో శ్రమించి పెంచిన ఎస్వోటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి మంచి పాలనను అందించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల ఆర్థిక వనరుల కన్నా తెలంగాణ ఆర్థిక వనరులు పుషలంగా ఉన్నాయని స్పష్టంచేశారు. పుష్కలమైన విద్యుత్తు, నీటి సౌకర్యం కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని వివరించారు. రాష్ట్రంలో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్తు సరఫరా వల్ల మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు పనిచేయడం, ఐటీ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించామని వెల్లడించారు. 2014లో 7,778 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉంటే, ప్రస్తుతం 26,000 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యమే ఇందుకు నిదర్శనమని స్పష్టంచేశారు.