హైదరాబాద్ ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ‘కుక్క తోక వంకర’ అన్నట్టు ఉన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్టని ఆ పత్రిక.. తెలంగాణ వ్యతిరేక అంశాలపై మాత్రం వల్లమాలిన ప్రేమ చూపుతున్నది. ‘అదిగో పులి’ అంటే..‘ఇదుగో ఇక్కడే ఉన్నది దాని తోక’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ర్టానికి చెందిన మంత్రి, పాలక పార్టీలో కీలక నేతపై వార్త రాసేటప్పుడు అది ఎంతవరకు నిజం? అని కనీసం ఆలోచించటం మీడియా సంస్థకు కనీస బాధ్యతగా ఉంటది. కానీ, ఆంధ్రజ్యోతికి అవేవీ పట్టలేదు. దేశంలోని అత్యంత సంపన్నులైన మంత్రుల్లో కేటీఆర్ ఉన్నట్టు ఆ పత్రిక గురువారం ఓ వార్తను ప్రచురించింది. జనవరి 31న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది.
అందులో దేశంలోని అత్యంత సంపన్నులు, అత్యల్ప ఆదాయం ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల వివరాలను పొందుపరిచారు. ఆ నివేదికను పూర్తిగా చదవకుండానే ఆంధ్రజ్యోతి పత్రిక అత్యంత సంపన్నులైన మంత్రుల జాబితాలో మంత్రి కేటీఆర్ ఉన్నట్టు వార్త రాసేసింది. నివేదికలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండోస్థానంలో ఉండగా, వైఎస్ఆర్సీపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 9వ స్థానంలో, విడుదల రజిని 10 స్థానంలో ఉన్నారు. టాప్ టెన్లో ముగ్గురు ఏపీవారే ఉన్నారు. నివేదికలో మంత్రి కేటీఆర్ పేరు లేనేలేదు. అయినప్పటికీ సంచలనం కోసం ఆంధ్రజ్యోతి కేటీఆర్ పేరును చేర్చింది. పైగా తెలుగు రాష్ర్టాల నుంచి నలుగురు మంత్రులు ఏడీఆర్ నివేదికలో చోటు దక్కించుకొన్నారంటూ విషపు రాతలు రాసింది. ఈ విషయం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్కు తెలియడంతో అంధజ్యోతిపై విరుచుకుపడుతున్నారు. ఏడీఆర్ రిపోర్టును జతచేస్తూ.. అందులో ఉన్న పేర్లలో కేటీఆర్ పేరులేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.