హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతి రోజూ 5 నిమిషాల పాటు యోగా లేదా ధ్యానం చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం ప్రార్థన అయిపోగానే తరగతి గదుల్లోనే యోగా చేయిస్తారు. నెలలో ప్రతి మూడో శనివారం నో బ్యాగ్ డేగా పాటిస్తారు. ఆ రోజు విద్యార్థులంతా పుస్తకాలు, నోటుబుక్స్ లేకుండా బడికి రావాల్సి ఉం టుంది. ఈ రోజున బడుల్లో బాలసభను నిర్వహిస్తారని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం విడుదల చేసిన 2022-23 అకాడమిక్ క్యాలెండర్లో స్పష్టం చేశారు. విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పది తరగతులకు 230 పనిదినాలు ఉంటాయి. దసరాకు 14 రోజులు, సంక్రాంతికి 5 రోజులు, మిషనరీ స్కూల్స్లో 7 రోజుల క్రిస్మస్ సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. 2023 ఏప్రిల్ 24 వరకు పాఠశాలలు నిర్వహించి, ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను ఫిబ్రవరిలో, వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు.