హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)ః తెలంగాణ నీళ్లల్లో వాటా ఉన్నదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని తెలంగాణ సర్కారు స్పష్టంచేసింది. కృష్ణానదీ యాజమాన్యబోర్డు చైర్మన్కు మంగళవారం రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు ఘాటుగా లేఖ రాశారు. నీటి వాటాల విషయంలో ఇటీవల ఏపీ సర్కారు లేవనెత్తిన పలు అంశాలను ఈఎన్సీ తిప్పికొట్టారు. ఇందుకు సంబంధించిన నివేదికలను, పత్రాలను లేఖతోపాటే పంపించారు. శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా 150 టీఎంసీలు తెలంగాణ వాడుకొనేలా ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టుల కంటే బేసిన్ ఆవతలి ఆంధ్రాప్రాంతాలకు నీటిని మళ్లించే ప్రాజెక్టులకే ప్రాధాన్యమిస్తూ ఉమ్మడి ఏపీ వాదనలు వినిపించిందని విమర్శించారు. దీనివల్లే బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు జరగలేదన్నారు. ప్రస్తుతం గోదావరి నది నుంచి ఇప్పటివరకు కృష్ణా నీళ్లు దక్కని ప్రాంతాలకు మాత్రమే నీళ్లను మళ్లిస్తున్నామని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి నది నుంచి కృష్ణాబేసిన్కు నీళ్లు మళ్లించడం ద్వారా కృష్ణ్ణలో జలాలు మిగులుతాయని, వాటిని నాగార్జునసాగర్ ఎగువన వాడుకోవచ్చని బచావత్ ట్రిబ్యునల్ తన అవార్డులో స్పష్టంగా పేర్కొన్నదని తెలియజేశారు. ఈ మేరకు ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర తమకు కేటాయించిన మిగులు జలాలను వాడుకొంటున్నాయని ఉదహరించారు. ఈ మేరకు సాగర్ ఎగువన తెలంగాణ వాడుకోవాల్సిన నీళ్లలో తమకు వాటా ఉన్నదని ఏపీ వాదించడం పూర్తిగా అర్థరహితం అని, ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధమని స్పష్టంచేశారు.