హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన 20వ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూపు ప్రదానం చేసే ఈ-గవర్సెన్స్ 2022 అవార్డు వరించింది. తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ చేపట్టిన ప్రాజెక్టుల పనితీరును గుర్తించిన సొసైటీ అవార్డును ప్రకటించింది. దీంతోపాటు టీ-చిట్స్ ప్రాజెక్టుకు ప్రత్యేక క్యాటగిరీ కింద ప్రశంసా అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక ఢిల్లీలో ఈ అవార్డులను అందుకొన్నారు. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ఐటీ శాఖ పరిధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ను ఏర్పాటు చేశామని, దీని ద్వారా ప్రభుత్వ శాఖల్లో అత్యంత మెరుగైన, పారదర్శక సేవలను అందిస్తున్నట్టు చెప్పారు. దానికి గుర్తింపుగానే ఈ అవార్డులు వరించినట్టు వివరించారు.
ఐటీ శాఖ కృషికి గుర్తింపు: మంత్రి కేటీఆర్
ఈ అవార్డులు.. పౌరులకు సమర్థవంతమైన, అధునాతనమైన సేవలను అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఐటీ శాఖ చేస్తున్న కృషికి గుర్తింపు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లక్ష్యాలను సాధించేందుకు ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబిస్తున్నామని, అందులో పీపీపీ అప్రోచ్ ఒకటని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక బ్లాక్ చైన్ ప్రాజెక్టులు ఉన్నా.. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ రూపొందించిన టీ-చిట్స్కు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడం గొప్ప విషయమని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్డ్ చిట్ఫండ్ వ్యాపారాల నిర్వహణలో టీ-చిట్స్ ఒక విప్లవాత్మక ప్రాజెక్టు అని వివరించారు. స్టార్టప్ చిట్మాంక్తో కలిసి 38 వేల గ్రూపులను ఏకీకృతం చేసి, సుమారు 20 బిలియన్ల యాక్షన్ టర్నోవర్ను నిర్వహిస్తున్నదని చెప్పారు.