హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేదు. ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడిచినా కేవలం 16 శాతమే డిజిటలైజేషన్ పూర్తి కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణకు తుది గడువు ఈనెల 24తో ముగియనున్నది. ఇక 15 రోజుల్లో 100 శాతం లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఈ పత్రాలను అందజేశారు. అయితే ఓటర్ల నుంచి సేకరించిన పత్రా ల డిజిటలైజేషన్లో మాత్రం జాప్యం జరుగుతున్నది. మొదటి రెండు వారాల్లో 16 శాతం పనులే పూర్తికావడంతో, గడువు ముగిసేలోగా మిగిలిన 84 శాతం పనులను పూర్తిచేయడం అధికారులకు సవాల్గా మారింది.
ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియలో గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల మధ్య వ్యత్యాసం కనిపిస్తున్నది. రాష్ట్రంలోని గ్రామీణ జిల్లాలు డిజిటలైజేషన్ పూర్తిలో ముందువరుసలో ఉండగా, అత్యధిక జనసాంద్రత కలిగిన జీహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధితోపాటు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలు, నగరాల పరిధిలోని జిల్లాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. బుధవారం రాత్రి 8 గంటల వరకు యాదాద్రి భువనగిరి జిల్లా 50.93 శాతం ఫారాల డిజిటలైజేషన్తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ 42.15 శాతంతో రెండోస్థానంలో, నల్లగొండ 39.61 శాతంతో మూడో స్థానంలో, ఖమ్మం 36.81 శాతంతో నాలుగో స్థానంలో, నిజామాబాద్ 30.39% శాతంతో ఐదోస్థానంలో ఉన్నాయి. మేడ్చల్ మలాజిగిరి జిల్లా లో కేవలం 1.76 శాతమే డిజిటలైజేషన్ పూర్తయింది. 47.36 లక్షల ఓటర్లు ఉన్న హైదరాబాద్ జిల్లాలో కేవలం 4.46 శాతమే పూర్తవగా, 36.99 లక్షల ఓటర్లు ఉన్న రంగారెడ్డి జిల్లాలో 5.49% మేరకే డిజిటలైజేషన్ జరిగింది.
ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించడానికి జూలై 24ను ఎన్నికల సంఘం తుది గడువుగా నిర్ణయించడంతో ఇక 15 రోజులే మిగిలుంది. నిర్మల్, నిజామాబాద్, నాగర్కర్నూల్, వనప ర్తి, జోగుళాంబ గద్వాల్, నల్లగొండ, జనగామ జిల్లాలు 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేశాయి. హైదరాబాద్ జిల్లా 95.08 శాతం, వికారాబాద్ 96.88 శాతంతో పంపిణీలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్రంలో సగటున ఈఎఫ్ల పంపిణీ 98.70 శాతం పూర్తయింది. ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ మాత్రం 15.71 శాతానికే చేరింది.