CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతనే కులవృత్తులు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని పలువురు విశ్వబ్రాహ్మణ నేతలు అన్నారు. ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు.
కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయానికి విశ్వబ్రాహ్మణులు ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల్ భగాయత్లోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ కులస్తులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ స్పీకర్, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసన్నారు. భవిష్యత్తులో కూడా వీరి అభివృద్ధికి మరింత చేయూత లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. కులవృత్తులు చేసుకునేవారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి దూరదృష్టితో రూ. లక్ష ఆర్థిక సహాయం పథకాన్ని పెట్టారన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత చేనేత కార్మికులు, విశ్వబ్రాహ్మణ కులస్తుల ఆత్మహత్యలు కనుమరుగయ్యాయన్నారు. కులవృత్తులు చేసుకునేవారికి ఆర్థికసహాయం చేసి ఆదుకుంటున్న కేసీఆర్కు జూలూరు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సభలో విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు లాల్ కోట వెంకటాచారి, కార్యదర్శి బొడ్డుపల్లి సుదర్శన్, ఉపాధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్, కుందారం గణేష్, వడ్ల హనుమాన్లు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ రామాచారి తదితరులతో పాటు పలు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు పాల్గొన్నారు.