హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు శుభవార్త. ప్రభుత్వం పాల సేకరణ ధరను పెంచింది. బర్రె పాల ధరను లీటర్కు రూ.2.72, ఆవు పాలకు రూ.5 చొప్పున పెంచుతున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం విజయ డెయిరీకి గేదె పాలు పోసే రైతులకు లీటర్కు రూ.46.69 చెల్లిస్తుండగా.. ఇక నుంచి రూ.49.40 చొప్పున చెల్లించనున్నారు. ఆవు పాల సేకరణ ధరను రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచనున్నారు. పెంచిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సోమవారం రాజేంద్రనగర్లో నిర్వహించిన పాడి రైతుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
వచ్చే మూడు నెలల్లో విజయ డెయిరీ పాల సేకరణ లక్ష్యం 5 లక్షల లీటర్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని సీఎం కేసీఆర్ సహకారంతో లాభాల బాట పట్టించినట్టు తెలిపారు. పాడి రైతులకు మరెక్కడా లేని విధంగా లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నట్టు వెల్లడించారు. గ్రామాల్లో రైతులు విజయ డెయిరీకి పాలు పోసేందుకు ముందుకు రావాలని, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను అందుకోవాలని కోరారు. పాల సేకరణ ధర పెంపుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్కు, మంత్రి తలసానికి కృతజ్ఞతలు తెలిపారు.