హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): తెలంగాణలో గొర్రెల సంతతితోపాటు మాంసం ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న కృషిలో కీలక ముందడుగు పడింది. ఒక్కొక్క గొర్రెకు మూడేసి గొర్రె పిల్లలను పుట్టించేందుకు పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. సాధారణంగా తెలంగాణలోని దక్కనీ జాతి గొర్రెలకు ఒక కాన్పులో ఒక గొర్రెపిల్ల మాత్రమే పుడుతుంది. అరుదుగా అంత కంటే ఎక్కువ జన్మిస్తుంటాయి.
మహారాష్ట్రలోని నారీ సువర్ణీ జాతి గొర్రెలకు దాదాపు 50% మేర ఒక కాన్పులో రెండేసి పిల్లలు పుడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జాతులపై శాస్త్రవేత్తలు గత రెండేండ్లుగా ఇంప్రూవల్ మేనేజ్మెంట్ అనే పద్ధతిలో ప్రయోగాలు చేస్తున్నారు. దక్కనీజాతి గొర్రెలకు ఒకే కాన్పులో రెండు లేదా మూడు పిల్లలు, నారీ సువర్ణీ గొర్రెలకు మూడు పిల్లలు జన్మించేలా ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో 60 దక్కనీజాతి గొర్రెలపై, 50 నారీ సువర్ణీ గొర్రెలపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల 10-12 దక్కనీ జాతి గొర్రెలకు ఒకే కాన్పులో రెండేసి పిల్లలు జన్మించాయి. మరో 3 గొర్రెలకు మూడు పిల్లలు పుట్టాయి. నారీ సువర్ణీ రకంలో 5 గొర్రెల్లో ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మించాయి.
ఇంప్రూవల్ మేనేజ్మెంట్ పద్ధతి ఇలా..
ఒకే కాన్పులో ఎక్కువ గొర్రె పిల్లలు జన్మించేందుకు శాస్త్రవేత్తలు ల్యాబ్లో ప్రయోగాలకు బదులుగా క్షేత్రస్థాయిలోనే కొత్త విధానాన్ని అమలుచేస్తున్నారు. సాధారణంగా గొర్రెలను పెంచే విధానానికి భిన్నంగా వీటిని పెంచుతున్నారు. వాటి జన్యుస్థితి సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. పోషణ, మంచి వసతి, రోగాల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గొర్రెల మందలో మేలు రకమైన, ఆరోగ్యవంతమైన గొర్రెలను ఎంపిక చేసి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. వాటికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
గొర్రెపోతులను మార్చాలి
సాధారణంగా గ్రామాల్లో గొర్రెల కాపరులు మందలో ఒకే గొర్రెపోతును ఎక్కువ సంవత్సరాలు ఉంచుతారు. అలాకాకుండా ఏడాదిన్నరలో గొర్రెలకు సంబంధించి రెండు సీజన్లు పూర్తవుతాయని, ఈ సీజన్లు పూర్తి కాగానే మందలోకి కొత్త గొర్రెపోతులను చేర్చాలని సూచిస్తున్నారు.
అనుకూల ఫలితాలు వస్తున్నాయి
గొర్రెల్లో ఒకే కాన్పులో ఎక్కువ పిల్లలు జన్మించేలా ఇంప్రూవల్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలుచేస్తున్నాం. ఇప్పటివరకు చేసిన ప్రయోగంలో మంచి ఫలితాలు వచ్చాయి. దక్కనీజాతి గొర్రెల్లో రికార్డు స్థాయిలో మూడు పిల్లలు జన్మించాయి. దీనిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి గొర్రెల కాపరులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం పశుసంవర్ధకశాఖ చర్యలు తీసుకోవాలి.
– ప్రొఫెసర్ ఆర్ఎంవీ ప్రసాద్, లైవ్స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ హెడ్