నిజామాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పూటకో నిర్ణ యం, రోజుకో ప్రకటనతో విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. జూన్ 1 నుంచి వర్సిటీకి తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించిన వీసీ.. 24 గంటలు గడవక ముందే సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం విస్మయానికి గురిచేస్తున్నది. వీసీ తీరుతో విసుగెత్తిన విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను తక్షణమే తొలగించాలంటూ ఆందోళన చేస్తున్నారు. టీయూలో రూ.కోట్లాది నిధులను దుర్వినియోగం చేశారని, ఆయనపై విచారణ చేసి జైలుకు పంపాలని ఆయా సంఘాల బాధ్యులు నిరసన తెలిపారు. వాస్తవానికి మే 31 వరకు యూనివర్సిటీకి సెలవులు ఉండగా.. ఉన్నట్టుండి సెలవులను రద్దు చేసి.. మే 18 నుంచి తరగతులను ప్రారంభించారు.
వీసీ నిర్ణయాలతో వర్సిటీలో గందరగోళం నెలకొనడం, విద్యార్థుల ఆందోళనలు ప్రారంభం కావడంతో మళ్లీ జూన్ 1 నుంచి 9 వరకు సెలవులు ప్రకటిస్తూ మే 31న ఆదేశాలు జారీచేశారు. గంటల వ్యవధిలోనే సెలవులు రద్దు చేసినట్టుగా జూన్ 1న వీసీ మరోసారి ఆదేశాలు ఇచ్చారు. టీయూలో పరిపాలన వ్యవస్థ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బుధవారం జరిగిన ఆందోళనలో కొంతమంది విద్యార్థులు నేరుగా విమర్శల దాడి చేశారు. సర్కారు రంగప్రవేశం చేసి పాలకవర్గంతో వర్సిటీలో పాలన చేయిస్తున్నా.. వీసీలో మార్పు రావడం లేదు. ఈసీ నియమించిన రిజిస్ట్రార్నే ప్రభుత్వం అంగీకరిస్తుందని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వారం క్రితమే వీసీకి లేఖ రాశారు. ఆ లేఖనూ పట్టించుకోకుండా.. వీసీ తనకే నచ్చిన కళంకిత వ్యక్తి, గతంలో ఈసీ తొలగించిన ప్రొఫెసర్ను రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.