హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రారం భం కానున్నాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి లోటు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను, ఎస్పీలను సీఎస్ ఇప్పటికే ఆదేశించారు. సచివాలయం, అసెంబ్లీతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
నేడు అన్ని నియోజకవర్గాలలో ర్యాలీలు
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం దాదాపు 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటాలని నిర్ణయించారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ ర్యాలీల కోసం ప్రతి జిల్లాకు 10 వేల జాతీయ జెండాలను అందించారు. ఈ కార్యక్రమం నిర్వహణ, పర్యవేక్షణకు నియోజవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించారు.
రేపు జాతీయ జెండా ఆవిష్కరణ
భారత్ యూనియన్లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్లను సీఎం ప్రారంభిస్తారు. ఆ తరువాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గిరిజన సంఘాలకు చెందిన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ ఈ సభకు హాజరవుతారు.
ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆదివాసి, గిరిజన తెగలకు చెందిన ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆర్టీసీ సేవలను సర్కారు వినియోగించుకోనున్నది. సభకు ముందుగా నెక్లెస్ రోడ్ నుంచి గుస్సాడీ, గోండు, లంబాడి తదితర 30 కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ జరుగనుంది. జిల్లా కేంద్రాల్లో మం త్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ఆవిష్కరించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు, కమిషనర్లు, చైర్మన్లు, సర్పంచ్లు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, నల్లగొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కే తారకరామారావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డిప్యూటీ మేయర్ మోతో శ్రీలత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 17న మధ్యాహ్నం 1.00 గంటకు పీవీమార్గ్లోని పీపుల్స్ ప్లాజా నుంచిసెక్రటేరియేట్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ జరుగుతుందని చెప్పారు.