హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాభివృద్ధిలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పాత్ర శూన్యమని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, తాతా మధు, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, కమల్రాజ్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మెట్టు శ్రీనివాస్, కే వాసుదేవరెడ్డి, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య తదితరులు హాజరయ్యారు.
అనంతరం తెలంగాణ భవన్లో ఎర్రబెల్లి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తదితరులతో కలిసి నామా మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అణచివేత చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కేంద్రం తీరును గత పార్లమెంట్ సమావేశాల్లో ఎండగట్టామని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనూ అదే బీజేపీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. రాష్ట్రం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ఏ ఒక్క రోజు కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్లో మాట్లాడలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంట్కు వచ్చిన రెండు జాతీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
బండి సంజయ్.. ఢిల్లీలో ధర్నా చెయ్: ఎర్రబెల్లి
రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నా.. ఆ పార్టీల ఎంపీలు రాజకీయ స్వార్థం కోసం పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు చిత్తశుద్ధితో ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలకు అండగా నిలవాలని సూచించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చినా కేంద్రం తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా తొక్కిపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టాభివృద్ధికి ఏమాత్రం సహకరించని కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందిపోయి.. బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దళితబంధుకు మంచి పేరు వస్తుండటంతో కండ్లు మండిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు.. ఆ పథకాన్ని ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
తెలంగాణకు కేంద్రం ఏమిచ్చింది?: కడియం
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 8 ఏండ్లుగా అదనంగా ఇచ్చిన నిధులు ఒక్క పైసా లేవని, ఒక్క విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానికి జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. దేశానికే రోల్ మాడల్గా నిలుస్తున్న తెలంగాణను అణచివేసేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తనను ఇనుగుర్తి నుంచి ఇంద్రప్రస్థకు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు అన్నారు. రాష్ట్ర ప్రగతికోసం, టీఆర్ఎస్ గెలుపు కోసం మున్నూరుకాపు కులమంతా కేసీఆర్ వెంటే ఉంటుందని చెప్పారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీల సాధనకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.