హైదరాబాద్ : ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా అన్ని గిరిజన ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన తెలపాలని గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు నిర్ణయించారు. గిరిజన నివాస ప్రాంతాలు, తండాలు, గూడేలు, చెంచుపెంటల్లో నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు.
గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం బుట్టదాఖలు చేసిందని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి సీఎం కేసీఆర్.. ఐదేండ్ల క్రితమే తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు పలుమార్లు స్వయంగా ప్రధానిని కలిసిన ఫలితం మాత్రం శూన్యం అని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రధాని మోదీ ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.