జగిత్యాల : తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీ కాదు ఖేడీ అంటూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మోదీ తెలంగాణకు నష్టం కలిగిస్తూనే ఉన్నారన్నారు.
విభజన చట్టానికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ రాష్ట్రానికి మోదీ తొలి ద్రోహం చేశారన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని విభజన చట్టంలో ఉన్నా.. ఇంతవరకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఎనిమిదేండ్లుగా దేశాన్ని పాలిస్తూ ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని దక్కించుకొని మత రాజకీయాలు చేస్తున్న మోదీ తెలంగాణకు పనికి వచ్చే ఒక్క మంచి పనైనా చేశారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది నెలల కాలంలో ఒక్క నవోదయ పాఠశాలను, సైనిక్ స్కూల్ ను సైతం మంజూరు చేయలేదన్నారు.
దేశవ్యాప్తంగా 154 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ.. రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి పథకాలతో గతంలో ఎప్పుడు లేనంతగా పంట పండిస్తే వడ్లు కొనమని రైతులను రాష్ట్రాన్ని దొంగ దెబ్బ తీసిన దుర్మార్గమైన చరిత్ర ప్రధాని మోదీదేని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే నచ్చని మోదీ జాతీయ సమావేశాల పేరిట హైదరాబాద్కు తెలంగాణపై అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.