Peddapalli | పెద్దపల్లి రూరల్, జనవరి 13 : వారం రోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన ఓ యువకుడు తాను నడుపుతున్న కారు బావిలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో గల రంగంపల్లిలో నివాసం ఉంటున్న తుమ్మ విజయపాల్రెడ్డి-విజయ దంపతులకు వినీత్రెడ్డి(27), విక్రమ్రెడ్డి ఇద్దరు కొడుకులు. వినీత్రెడ్డి ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. క్రిస్మస్ సెలవులకు పెద్దపల్లికి వచ్చిన వినీత్రెడ్డి ఈ నెల 20న ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు.
శుక్రవారం తమ సొంతూరైన గుంటూరుపల్లికి వెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, బంధువులను కలిసి సరదాగా గడిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి కారులో బయలుదేరారు. పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లి శివారులో పెద్దకల్వలకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పి పక్కనున్న వ్యవసాయబావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయితేజరెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చి కారు అద్దాలను బండ రాయితో పగుల గొట్టడంతో మరో ఇద్దరిని లాగడంతో వారు పైప్ సహాయంతో పైకి చేరుకున్నారు. కారు నడుపుతున్న వినీత్రెడ్డి(27) సీటు బెల్టు పెట్టుకోవడంతో బయటకు రాలేక బావిలోనే మృతి చెందాడు. వినీత్రెడ్డి మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున వెలికితీశారు.