కడ్తాల్, మార్చి 14: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని జాతీయ జీవనోపాధి మిషన్ ప్రతినిధులు కొనియాడారు. త్రిపుర, నాగాలాండ్, దాద్రానగర్ హవేలీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, డామన్ డయ్యూ రాష్ర్టాలకు చెందిన గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు, సీఈవోలు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లకు.. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీపీఆర్లో ‘అభివృద్ధి పనులు-నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, అభివృద్ధిలో స్థానిక సంస్థల ప్రాముఖ్యత’ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ పంచాయతీని జాతీయ జీవనోపాధి మిషన్ ప్రతినిధులతో కలిసి ఆయా రాష్ర్టాలకు చెందిన అధికారులు, ప్రతినిధులు సందర్శించారు. గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు వేదిక, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామంతోపాటు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు.
మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకున్న వ్యాపార కేంద్రాలను, పచ్చళ్ల తయారీని, మగ్గం పనులను పరిశీలించారు. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, ప్రోత్సాహకాలను వారు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి సర్పంచ్ వారికి వివరించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పల్లె ప్రగతి కార్యక్రమం బాగున్నదని కితాబిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ రాష్ర్టాల్లో అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.