హైదరాబాద్, మార్చి 7 : రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ఆర్థిక సర్వే-2022 స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ వైద్య రంగం పనితీరును విశ్లేషిస్తూ నీతీ ఆయోగ్ విడుదల చేసిన 4వ ‘హెల్త్ ఇండెక్స్’లో ఓవరాల్ ర్యాంకింగ్స్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పురోగతిలో మొదటి స్థానంలో నిలిచిందని గుర్తుచేసింది. ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలను కొత్తగా మంజూరు చేయటంతో మరో 1,200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 256 బస్తీ దవాఖానల్లో 53 రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నారు. 573 పల్లె దవాఖానలు ఏర్పాటయ్యాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 2021 సెప్టెంబర్ వరకు 10.36 లక్షల మంది లబ్ధి పొందారు. ప్రభుత్వం రూ.4,651 కోట్లు ఖర్చు చేసింది. 2015-16, 2019-20 మధ్య నవజాత శిశు మరణాల రేటు 27.7 నుంచి 26.4కు తగ్గింది. దవాఖాన ప్రసవాలు 91.5 శాతం నుంచి 97 శాతానికి చేరాయి.