హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): దేశంలో పచ్చదనం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 6న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని మంత్రి హరీశ్రావు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2019 ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం 632 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు.
శాతాల్లో పరిశీలిస్తే 3.07 శాతం పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అవిశ్రాంతమైన ప్రయత్నాలు రాష్ట్రవ్యాప్తంగా అడవులు, చెట్ల విస్తీర్ణంలో గణనీయమైన పెరుగుదలకు దోహపడ్డాయని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో కూడిన నాయకత్వం, ఆయన మానస పుత్రిక హరితహారం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపారు. అటవీ శాఖ చేసిన ప్రయత్నాలకు అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.