హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సుపరిపాలనను అందించడంలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. అనేక రంగాల్లో తెలంగాణ దేశంలోని పలు రాష్ర్టాలను అధిగమించి ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతున్నది. రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే ప్రజలకు మేలైన పరిపాలన అందుతున్నదని కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదలచేసిన గుడ్గవర్నెన్స్ ఇండెక్స్ గణాంకాలతో స్పష్టంచేసింది. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, పబ్లిక్ గ్రీవెన్సెస్ శాఖ 2020-21 సంవత్సరానికి రాష్ర్టాలకు గుడ్ గవర్నెన్స్ ర్యాంకులను ప్రకటించింది. రాష్ర్టాలను రెండు క్యాటగిరీలుగా, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒక క్యాటగిరీగా, ఈశాన్య రాష్ర్టాలు, కొండలు, గుట్టలతో కూడిన రాష్ర్టాలను మరో క్యాటగిరీగా విభజించి ర్యాంకులు ప్రకటించారు. తెలంగాణ రెండు అంశాల్లో మొదటిస్థానంలో నిలువగా, మరో రెండు అంశాల్లో రెండోస్థానంలో నిలిచింది. వ్యవసాయం, దాని అనుబంధ శాఖ బాగా పురోగతి సాధించిందని నివేదికలో వెల్లడించారు.
గుడ్ గవర్నెన్స్ను అంచనా వేయడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు వాణిజ్యం, హెచ్ఆర్డీ, పబ్లిక్ హెల్త్, ప్రజా మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, ఆర్థిక నిర్వహణ, సాంఘిక సంక్షేమం అభివృద్ధి, జ్యుడీషియరీ, పబ్లిక్ సేఫ్టీ, పర్యావరణం, ప్రజలు కేంద్రంగా పరిపాలన వంటి పది రంగాల్లో సాధించిన ప్రగతి ప్రాతిపదికన గుడ్ గవర్నెన్స్ ర్యాంకులను ఖరారు చేశారు. పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో తెలంగాణ మొదటి ర్యాంకు సాధించింది. సాంఘిక సంక్షేమం, అభివృద్ధి అంశంలోనూ తొలి ర్యాంకును సాధించి దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ఆర్థిక నిర్వహణ, ప్రజామౌలిక సదుపాయాల్లో రెండో ర్యాంకును సాధించింది.
ఈడీవోడీ, పరిశ్రమల వృద్ధి, ఎమ్మెస్ఎంఈల ఏర్పాటు, స్టార్టప్లు, జీఎస్టీ కింద సంస్థలు రిజిస్టర్ కావడం ఆధారంగా ఈ క్యాటగిరీలో ర్యాంకులిచ్చారు. 0.699 స్కోర్తో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. టీఎస్ఐపాస్ చట్టం ద్వారా పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం, లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమయ్యాయి. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన పరిపాలన, శాంతిభద్రతలు, భూమి లభ్యత, నీరు, విద్యుత్తు, మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో పారిశ్రామికవేత్తలు మన దగ్గరకు తరలివస్తున్నారు. గూగుల్, అమెజాన్లాంటి ప్రపంచస్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. విద్యుత్తు తలసరి వినియోగంలో, అవసరాల కంటే ఎక్కువగా అందుబాటులో విద్యుదుత్పత్తి జరగటం, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను వేయండం వంటి వాటితో ప్రజా మౌలిక సదుపాయాల్లో తెలంగాణ ముందు నిలిచింది.
ఎకానమిక్ గవర్నెన్స్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రం సొంత పన్నుల రాబడుల్లో గతంలో కంటే ఎంతో వృద్ధిని సాధించిందని నివేదికలో వెల్లడించారు. ఇతర ఆర్థిక అంశాల్లో తెలంగాణ క్రమశిక్షణతో వ్యవహరించడంతో రెండో స్థానంలో నిలిచింది. సాంఘిక్ష సంక్షేమం, ఆరోగ్యబీమా, గ్రామీణ ఉపాధి రంగాల్లో మెరుగుదలతో తెలంగాణ ముందు నిలిచింది. ప్రతి ఒక్కరికి ఇల్లు, ఆర్థిక అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం విషయాల్లో ప్రగతి సాధించి దేశంలోనే తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ 0.413 స్కోరు సాధించింది.