హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): ఔషధాల ఎగుమతుల్లో తెలంగాణ హవా కొనసాగుతున్నది. దేశ ఎగుమతుల్లో 20-30 శాతం మన రాష్ట్రం నుంచే జరగడం విశేషం. గత ఏడాది డిసెంబర్ వరకు దేశం నుంచి 21 బిలియన్ల(రూ.1,72,000 కోట్లు) ఎగుమతులు జరుగగా, ఇందులో సింహభాగం తెలంగాణ నుంచే జరిగాయి. తెలంగాణ రాష్ట్రం జనరిక్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ తయారీకి సంబంధించిన కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్నది. రాష్ట్రం నుంచి 150కి పైగా దేశాలకు ఔషధాలు, వ్యాక్సిన్లు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక యుఎస్ఎఫ్డీసీ అనుమతి పొందిన కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. న్యూజెర్సీకన్నా అధికంగా యుఎస్ఎఫ్డీఏ అనుమతి పొందిన కంపెనీలు ఇక్కడ ఉండటం విశేషం. రాష్ట్రంలో 214 కంపెనీలకు యుఎస్ఎఫ్డీఏ అనుమతులు ఉండగా, న్యూజెర్సీలో 189 కంపెనీలకు మాత్రమే ఈ గుర్తింపు ఉన్నది.
త్వరలో అంతర్జాతీయ గుర్తింపు
మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీతో ఔషధ రంగం అభివృద్ధి చెంది ఎగుమతుల్లో మరింత వృద్ధి నమోదయ్యే అవకాశమున్నది. ఫార్మాసిటీ ప్రారంభానికి చేరువలో ఉన్నదని, ఇది సిద్ధమైతే తెలంగాణ రాష్ట్రం ఔషధాల తయారీ కేంద్రంగా మారి అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఇటీవల బయో ఏషియా సదస్సు వివరాలు వెల్లడిస్తూ పేర్కొన్నారు. ఇందులో అంతర్జాతీయ సౌకర్యాలు, ఫార్మా యూనివర్శిటీ, మెడికల్ కాలేజ్, నర్సింగ్ స్కూల్, దవాఖాన తదితర సౌకర్యాలు ఏర్పడతాయని ఆయన చెప్పారు. దీనికోసం ఇప్పటికే 14000ఎకరాల భూమిని సమీకరించినట్టు మంత్రి వివరించారు.
దేశ ఎగుమతుల్లో సింహభాగం రాష్ర్టానిదే
తెలంగాణ నుంచి 2021-22లో 4446.78 మిలియన్ డాలర్ల ఔషధాల ఎగుమతులు జరిగినట్టు, 2020-21తో పోల్చితే ఇది 800 మిలియన్ డాలర్లు అధికమని ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో తెలిపారు. 2021లో దేశం నుంచి 24.4 బిలియన్ల ఎగుమతులు జరగగా, అందులో తెలంగాణ నుంచి 3672.65 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్టు ఆమె వివరించారు.