హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జాతీయ పంచాయతీ అవార్డులకు పోటీపడటంలో తెలంగాణ దేశంలోని ఏ రాష్ర్టానికి అందనంత ఎత్తులో నిలిచింది. ఈ ఏడాది దేశంలోని మొత్తం 2.68 లక్షల గ్రామ పంచాయతీల్లో 36,677 ఈ పోటీలో పాల్గొంటున్నాయి. వీటిలో ఏకంగా 9,786 (27 శాతం) పంచాయతీలు మన రాష్ట్రానివే. మిగిలిన రాష్ర్టాల నుంచి పోటీపడుతున్న పంచాయతీల సంఖ్య ఇందులో సగం కూడా లేకపోవడం గమనార్హం. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం వల్లనే తెలంగాణ నుంచి అత్యధిక పంచాయతీలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనగలుగుతున్నాయి. ఈ పోటీలకు నిర్దేశించిన అర్హతలను సాధించడంలో ఇతర రాష్ర్టాల గ్రామ పంచాయతీలు, ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ర్టాల పంచాయతీలు ఘోరంగా విఫలమయ్యాయి. జాతీయ పంచాయతీ అవార్డులను కైవసం చేసుకోవడంలో ఇప్పటికే అగ్రగామిగా కొనసాగుతున్న తెలంగాణ.. ఇకముందు కూడా అదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నది. ఇందుకోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కట్టుదిట్టమైన ప్రణాళికను రూపొందించింది. ఈ ఏడాది ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన వాటికి వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందిస్తుంది. మొత్తం 9 క్యాటగిరీల్లో ఈ అవార్డులను అందజేస్తారు.
అవార్డుల క్యాటగిరీలు
వీటిలో ఒక్కో అంశానికి జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇస్తారు. ప్రథమ బహుమతి కింద రూ.50 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.40 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.30 లక్షలు అందజేస్తారు. ఇదే తరహాలో ఉత్తమ మండలాలు, జిల్లాలకు అవార్డులను ప్రదానం చేస్తారు. ఉత్తమ జిల్లాలకు రూ.1.50 కోట్లు, ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లాలకు రూ.1.25 కోట్లు, తృతీయ స్థానంలో నిలిచిన జిల్లాలకు రూ.1 కోటి చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు.