న్యూస్నెట్వర్క్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఉన్నారు. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. ఏకగ్రీవమైనవారికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారులు అందజేయనున్నారు. స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది జిల్లాల్లోని 12 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్లకు మంగళవారంతో గడువు ముగియడంతో రిటర్నింగ్ అధికారులు బుధవారం వాటిని పరిశీలించారు. మొత్తం 99 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 24 నామినేషన్లను తిరస్కరించారు. స్క్రూటినీ అనంతరం మహబూబ్నగర్ నుంచి ఒకరు, ఆదిలాబాద్ నుంచి మరొకరు ఉపసంహరించుకున్నారు. దీంతో 73 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కరీంనగర్లో రెండు స్థానాలకు 24 నామినేషన్లు, ఆదిలాబాద్లో ఒక స్థానానికి 23 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు కోటగిరి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశా రు. శ్రీనివాస్ తమ సంతకాలను ఫోర్జరీ చేసి, మద్దతు ఇస్తున్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నందిపేట ఎంపీటీసీ నవనీత, నిజామాబాద్ నగరపాలక సంస్థ 31వ డివిజన్ కార్పొరేటర్ రజియా సుల్తానా రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగా ఆయనపై చర్య తీసుకొనేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమవుతున్నది.
ఫారం 26లో అఫిడవిట్లో తప్పులు ఉన్నందున శ్రీనివాస్ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ సీ నారాయణరెడ్డి ప్రకటించారు. దీంతో కవిత గెలిచినట్టు ప్రకటించడం లాంఛనంగా మారింది. ఆమె ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం వరుసగా ఇది రెండోసారి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మె ల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుతోపాటు చం ద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖ లు చేశారు. గడువు దాటాక నామినేషన్ వేయ డం, డిపాజిట్ డబ్బులు చెల్లించకపోవడం, నామినేషన్ను ప్రతిపాదించే వారి సంతకాలు లేకపోవడంతో చంద్రశేఖర్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవమయ్యారు. ఈ మూడు స్థానాలతోపాటు మరికొన్ని ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తున్నది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం సాయంత్రం వరకు గడువు ఉన్నది. ఈలోగా మరికొందరు ఉపసంహరించుకుంటారని సమాచారం. ఒకవేళ ఎన్నికలు అని వార్యమైనా మిగిలిన 9 స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న అభిప్రాయం వ్య క్తమవుతున్నది. ఎన్నికలు జరుగుతున్న 9 ఉమ్మడి జిల్లాల్లోని 12 స్థానాల్లో మొత్తం 9,791 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే ఏకగ్రీవమైన నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలను తీ సేస్తే, మిగిలిన 9 స్థానాల్లో 7,792 మంది ఓ టర్లు ఉన్నారు. వీరిలో 90 శాతానికిపైగా టీఆర్ఎస్ నుంచి ఎన్నికైనవారే కావడం విశేషం. ఇ తర పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన మరికొందరు కూడా టీఆర్ఎస్లో చేరారు.
ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవమైన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకు లు, కార్యకర్తలు సంబురాలు చేసుకొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా నివాసంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్రావు తదితరులు మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్సీ కవితకు టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. ఆమె గెలుపుతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరింత మేలు కలుగుతుందని పేర్కొన్నారు.