కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 27: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన సందర్శకులు స్టాళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన సందర్శకులు స్టాళ్ల అన్నింటినీ పరిశీలించి ఆయా రియల్ ఎస్టేట్ సంస్థలు అందిస్తున్న వెంచర్లు, ప్లాట్లు, ఫ్లాట్ల వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్, కరీంనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు కనుక్కొన్నారు.
వ్యాపారాలు, భూములు, ఇండ్ల కొనుగోలుకు సంబంధించి ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందిస్తున్న రుణాల వివరాలను సందర్శకులకు సిబ్బంది వివరించారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ విద్యుత్తు వినియోగం, ఏర్పాటుపైనా పలు సంస్థలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ప్రతి రెండు గంటలకోసారి లక్కీ డ్రా నిర్వహించి ఆకర్షణీయమైన బహుమతులు అందించారు. సాయంత్రం బంపర్ లక్కీ డ్రా కింద సెల్ఫోన్ అందించారు. ఈ షోను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్కుమార్గౌడ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావాత్, డీఏవో శ్రీధర్, ల్యాండ్ సర్వే ఏఈ అశోక్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, కేడీసీసీ బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు తదితరులు సందర్శించారు.
హైదరాబాద్కు దీటుగా కరీంనగర్..
హైదరాబాద్కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతున్నదని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ అన్నారు. ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్తో పాటు కరీంనగర్ కూడా భారీగా అందించే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా నిర్వహించిన అంగారిక టౌన్ కింద వేలం నిర్వహించగా రూ.130 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో భూ సమస్యలను సాధ్యమైనంత వరకు లేకుండా చేశామని, అయితే అక్కడక్కడా కొన్ని వస్తూనే ఉంటాయన్నారు. అందుకే అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయడం మంచిదని పేర్కొన్నారు. కాగా, సంగెం రాధాకృష్ణ ఆధ్వర్యంలో బాల సదన్ విద్యార్థులు ప్రదర్శించిన కళాప్రదర్శనలను అందరినీ ఆకట్టుకున్నాయి.