హనుమకొండ చౌరస్తా, మార్చి 17: హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. శని, ఆదివారాలు (రెండురోజులపాటు) నిర్వహించిన ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు, బైకులను ప్రదర్శనకు పెట్టారు. మహావీర్ బెంజ్, మహావీర్ స్కోడా, కృష్ణ వోల్వో, ఆడి హైదరాబాద్, ప్రైడ్ జీప్, పీపీఎస్ వోల్క్స్వాగన్, విన్ టీవీఎస్, విన్ మోటార్స్, మోటార్లైన్ మహీంద్ర, మిత్ర సుజికి, కియామోటార్స్, ఆదర్శ మోటార్స్, ఆదర్శ నెక్సా, గ్రీన్హోండా, హ్యాపీ ఆటోమోటివ్ యమహా, హేమా హుందాయ్, ప్రైడ్ సిట్రోన్, ఎంజీ మోటార్స్, మహావీర్ జేఎస్యూజెడ్యూకు చెందిన యాజమాన్యాలు తమ లేటెస్ట్ కార్లు, బైక్లను ప్రదర్శనలో పెట్టాయి. ఆధునిక టెక్నాలజీతోపాటు సరికొత్త ఫ్యూచర్లతో పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు ఆటోషోలో ఆకట్టుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడంతో వినియోగదారులు వాటిపై ఆసక్తి చూపించారు. స్టాళ్ల సందర్శనకు వచ్చినవారిని ప్రోత్సహించేందుకు నమస్తే తెలంగాణ బంపర్ డ్రా ఏర్పాటు చేసింది. డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రతి రోజూ మూడు లక్కీ డ్రా ద్వారా కూపన్లు తీసి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆటో షోకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వాహన ప్రేమికులు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపారు. కంపెనీ నిర్వాహకులు కార్లు, బైకుల విశేషాలను కొనుగోలుదారులకు వివరించారు. కారు, బైక్ మోడళ్ల వివరాలను కొనుగోలుదారులు అడిగి నివృత్తి చేసుకున్నారు. కొందరు వెంటనే కార్లు, బైక్లను కొనుగోలు చేశారు. ఆటోషోకు వచ్చిన వినియోగదారులు తమకు నచ్చిన వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేశారు. ఎక్కువగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా చేతక్ వాహనాలపై తిరిగారు. నచ్చిన కార్ల గురించి తెలుసుకొని అందులో చక్కర్లు కొట్టారు. వాహనాలు కొనాలనుకునే వారి కోసం అనేక రకాల వాహనాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో షోలకు అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదని నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్రావు చెప్పారు. గతంలో ఇలాంటి షోలు ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమయ్యేవని, ఇప్పుడు మన నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ప్రజలకు అన్ని వాహనాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఆటోషో ఎంతో ఉపయోగపడుతున్నదని పేర్కొన్నారు. ఇకముందు కూడా మరిన్ని షోలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్, ఏజీఎం ఎం రాజిరెడ్డి, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, యాడ్ మేనేజర్లు అప్పని సూరయ్య, శ్రీచరణ్ ఆనంద్, సర్క్యులేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్ అని స్టేషన్ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఆటో షో ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఈ ఆటో షో ద్వారా ప్రముఖ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాల సరికొత్త మాడల్స్ను ఒకే వేదికపై వాహన ప్రేమికుల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వార్తలను ప్రచురించడమే కాకుండా ప్రజా అవసరాలను గుర్తించి గతంలో ప్రాపర్టీ షోలు, ఇపుడు ఆటో షో నిర్వహించారని తెలిపారు. పత్రికల ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవలు నిర్వహించడం చాలా సంతోషకరమని కొనియాడారు. టాప్ మాడల్స్ కంపెనీలు వరంగల్లాంటి నగరంలో ఆటోషోలు పెడితే కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.