Bio Asia 2023 | ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల పరిశోధకులు, హెల్త్కేర్, బయోటెక్ సంస్థల అధిపతుల రాకతో బయోఏషియా-2023 సదస్సు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా మూడురోజులపాటు జరుగనున్న ఈ గ్లోబల్ సమిట్కు 50 దేశాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. నొవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్ కీలకోపన్యాసంతో సదస్సు ప్రారంభమైంది. బయోసైన్స్ రంగంలో భవిష్యత్తు రాజధానిగా తెలంగాణ ఎదుగుతున్న క్రమాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సదస్సులో వివరించారు.ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు కనుగొనే దిశగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి.
నానోపార్టికల్స్పై కీలక పరిశోధనలు చేసిన మోడెర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ లాంగర్కు ఎక్స్లెన్స్ అవార్డును వర్చువల్గా అందజేశారు. ఇక యువ ఆవిష్కర్తల కోసం వై-హబ్ ఏర్పాటు దిశగా యూనిసెఫ్తో రాష్ట్ర ఐటీశాఖ ఒప్పందం సదస్సు తొలిరోజున ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణలో ముఖ్యంగా ఇన్నోవేషన్కు అపార అవకాశాలున్నాయి. ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఔషధ, లైఫ్సైన్సెస్ రంగంలో అవకాశాల గుర్తింపునకు బయో ఏషియా సదస్సు మంచి వేదిక. మంత్రి కేటీఆర్ సహకారం లేకుండా ఇంతపెద్ద కార్యక్రమం సాధ్యం కాదు.
-నొవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నైపుణ్యంగల సిబ్బందికి కొదవలేదని, తమ విజయం వెనుక తమ ఉద్యోగులదే కీలకపాత్ర అని నొవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎంతో సహకారం లభించిందని చెప్పారు. అద్భుత అవకాశాలకు కొలువైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. 15 ఏండ్ల క్రితం ఇక్కడ వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని వచ్చామని, నేడు ఇక్కడి అవకాశాలు, ప్రభుత్వ సహకారంతో తమ కార్యకలాపాలను అనేక రెట్లు పెంచామని వెల్లడించారు. శుక్రవారం ప్రారంభమైన బయో ఏషియా -2023 సదస్సులో నరసింహన్ కీలకోపన్యాసం చేశారు. గత ఐదేండ్లలో హైదరాబాద్లో తమ కార్యకలాపాలను రెట్టింపు చేశామని చెప్పారు. క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు తరువాత తమకు అత్యంత కీలకమైన డ్రగ్ డెవలప్మెంట్, డాటా మేనేజ్మెంట్, పేషెంట్ సేఫ్టీ, తయారీ కేంద్రాలు, ప్రొక్యూర్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ తదితర కార్యకలాపాలు కూడా ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్లోని తమ కేంద్రం ఇప్పుడు సర్వీ స్ సెంటర్ మాత్రమే కాదని, కార్పొరేట్ సెంటర్ అని వెల్లడించారు. ప్రపంచంలో తమకున్న మూడు ముఖ్య కేంద్రాల్లో ఇదీ ఒకటని పేర్కొన్నారు. ఈ కేంద్రం హైదరాబాద్ మాత్ర మే కాకుండా భారతదేశ వృద్ధి కథలో అత్యంత కీలకమైనదని వివరించారు. తమ వ్యాల్యూ చెయిన్ను కూడా వృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం అపార అవకాశాలు, నైపుణ్యాలకు కేంద్రమని నరసింహన్ తెలిపారు. భారతదేశంలో, తెలంగాణలో పెట్టుబడులు కొనసాగించాలని సూచించారు. ‘తెలంగాణలో ముఖ్యంగా ఇన్నోవేషన్కు అపార అవకాశాలున్నాయి. ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఔషధ, లైఫ్సైన్సెస్ రంగంలో అవకాశాల గుర్తింపునకు బయో ఏషియా సదస్సు మంచి వేదిక. మంత్రి కేటీఆర్ సహకారం లేకుండా ఇంతపెద్ద కార్యక్రమం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణా ల కోసం ఔషధాల ఆవిష్కరణ ఎంతో అవసరమని చెప్పారు. పరిశోధన, సాంకేతికత అభివృద్ధితో అనేక వ్యాధులకు కొత్త ఔషధాలు, వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. నూతన ఆవిష్కరణల ఫలితంగా నేడు అత్యంత ప్రమాదకర కార్డియో వాస్కులర్ వ్యాధికి మెరుగైన ఔషధాలు అందుబాటుకి వచ్చాయని.. మలేరియా, కుష్టు వంటి మొండి వ్యాధులు కూడా పూర్తిగా నయమవుతున్నాయని వివరించారు. అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్ వ్యాధి నిర్మూలనలోనూ ఎంతో ప్రగతి సాధించామని.. ఇమ్యునో ఆంకాలజీ, టార్గెటెడ్ థెరపీ వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. టార్గెట్ రేడియేషన్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు నష్టం జరుగకుండా క్యాన్సర్ కణాలను నిర్మూలించవచ్చని వెల్లడించారు. మెదడులో ఏర్పడే ట్యూమర్లను కూడా ఈ విధానం ద్వారా నిర్మూలించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో సాంకేతికత అభివృద్ధి వల్ల మరింత మెరుగైన వైద్య విధానాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నా రు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని అధునాతన ఆవిష్కరణలు జరిగే అవకాశమున్నదని తెలిపారు.
సదస్సు సందర్భంగా నరసింహన్ విలేకరులతో మాట్లాడుతూ, భారత్లో రెగ్యులేటరీ డాటా ప్రొటెక్షన్ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ప్రపంచంలోని పెద్ద ఔషధ కంపెనీలు ప్రాథమిక ఔషధ పరిశోధనలు నిర్వహించేందుకు ఇది ఎంతగానో అవసరమని చెప్పారు. మేథో సంపత్తి (ఐపీ) పరిరక్షణ కోసం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకొన్నారని, ఇప్పు డు డాటా పరిరక్షణ కోసం రెగ్యులేటరీ డాటా ప్రొటెక్షన్ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. బహుళజాతి సంస్థలు నిర్వహించే పరిశోధనలకు సంబంధించి చైనాసహా పలు ఇతర దేశాల్లో రెగ్యులేటరీ డాటా ప్రొటెక్షన్ వ్యవస్థ అమల్లో ఉన్నదని చెప్పారు. భారత్లో క్లినికల్ ట్రయల్స్కు అనుమతులు పొందడం గతంలో ఎంతో కష్టంగా ఉండేదని, ఇప్పుడు కొత్త విధా నం తేవడంతో సమస్య పరిష్కారమైందని అన్నారు. రెగ్యులేటరీ డాటా ప్రొటెక్షన్ వ్యవస్థ తేవడంతోపాటు మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపడితే ప్రాథమిక ఔషధ పరిశోధనలకు భారత్లో అపార అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. హైదరాబాద్లోని నోవార్టిస్ డ్రగ్ డెవలప్మెంట్ కేంద్రంలోని 2,400 మంది సహా తమ డ్రగ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో మొత్తం 9,000 మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు నరసింహన్ వివరించారు. హైదరాబాద్ కేంద్రంలో గడిచిన అయిదేండ్లలో తమ సంస్థ కార్యకలాపాలు రెట్టింపయ్యాయని వెల్లడించారు.