ఆదిలాబాద్ : కొవిడ్ -19 కు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేసి నివేదించాల్సిందిగా ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ పౌరులకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939, పోలీసు శాఖ 94407 95079, వైద్య, ఆరోగ్యశాఖ 73827 26029 నంబర్లకు ఫోన్ చేసి తెలుపొచ్చని ఆయన చెప్పారు. మంగళవారం రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా పరిపాలన యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
నిబంధనలు అనుసరించి కొవిడ్ -19తో మృతిచెందిన వారి తుది కర్మలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొవిడ్ రోగులను తరలించేందుకు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అధఙకారులంతా కలిసి పనిచేయాలన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పంచాయతీరాజ్ అధికారులకు చెప్పారు. అదేవిధంగా క్రిమిసంహారక సోడియం హైపోక్లోరైట్ ను పిచికారీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 45 ఏళ్లు పైబడిన పౌరులకు కొవిడ్ టీకాలు వేయాలన్నారు. టీకాపై ఉన్న భయాన్ని, అనుమానాల్ని తీర్చాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ వినోద్ కుమార్, ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జాడి రాజేశ్వర్, జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ రాథోద్ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి బలరామ్, ఎన్పిడిసిఎల్ ఎస్ఈ ఉత్తమ్ జాడే, ఆదిలాబాద్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.